ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి విశాఖ పేరు మారుమోగుతోంది.అప్పటి వరకు అమరావతి రాజధాని అంటూ దాదాపు అంతా ఫిక్స్ అయిన నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వం విశాఖ లో రాజధాని ఉండాలి అంటూ పట్టుబట్టడం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉండటం వంటి వ్యవహారాలు నడుస్తున్నాయి.
కోర్టు వ్యవహారాలు లేకపోతే ఇప్పటికే పూర్తిస్థాయిలో విశాఖ లో పరిపాలనా రాజధాని మొదలు అయ్యి ఉండేది.ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, విశాఖ ప్రజలలో చెరగని ముద్ర వేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అయితే తాజాగా విశాఖ ఎయిర్ పోర్ట్ మూసివేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి ని విజయసాయి రెడ్డి కోరినట్లుగా స్వయంగా మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఇప్పుడు పెద్ద కారణమైంది.
అసలు విశాఖ కు తలమానికంగా ఉన్న ఎయిర్ పోర్ట్ ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది అనే అంశంపై జోరుగా చర్చ మొదలైంది.
అయితే దీనికి కారణం భోగాపురం ఎయిర్ పోర్ట్ అట.విశాఖ ఎయిర్ పోర్ట్ ను మూసి వేస్తేనే భోగాపురం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోనే విజయసాయిరెడ్డి ఈ లేఖ రాసినట్లుగా ఇప్పుడు బయటకు రావడానికి కారణం అవుతోంది.
గతవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూరిని విజయసాయి రెడ్డి కలిశారు.ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు అనుమతి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయాన్ని విజయ్ సయి రెడ్డి స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
ఇక ఆ తర్వాత కేంద్ర మంత్రి అజిత్ సింగ్ పూరి సైతం విజయసాయి రెడ్డి తనను కలిశారని విశాఖ ఎయిర్ పోర్ట్ ను 30 ఏళ్లపాటు మూసివేయాలని కోరారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.ఇప్పుడు విజయసాయిరెడ్డి టార్గెట్ గా ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేస్తుండగా, విశాఖ వాసులు సైతం ఈ లేఖ పై మండిపడుతున్నారు.అయితే గత టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్ట్ ను నిర్మించాలని చూడడం, భూముల కేటాయింపు చేయడం జిఎంఆర్ కాంట్రాక్ట్ ఇవ్వడం వంటి వ్యవహారాలు ఎన్నో జరిగాయి.
అయితే ఈ వ్యవహారం లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ , టిడిపి ప్రభుత్వం పై విమర్శలు చేయడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కాంట్రాక్టును రద్దు చేసింది.ఇక ఆ తర్వాత మళ్లీ అదే జీఎంఆర్ కు కాంట్రాక్ట్ ఇవ్వడం భోగాపురం అభివృద్ధి చెందాలంటే విశాఖ ఎయిర్ పోర్ట్ 30 ఏళ్ల పాటు మూయించి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లుగా, ఇప్పుడు ప్రచారం జరుగుతుండడంతో వైసీపీ ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు గా కనిపిస్తోంది.