కరోనా భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాలను నాశనం చేస్తోందని అందరూ అనుకుంటున్నారు.అయితే కరోనా సోకని ఓ గ్రామం ఉన్నట్లు చాలా మందికి తెలీదు.
ఆదివాసీ గ్రామాలు, గూడెల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు.అక్కడి ప్రజలు మాస్కులు, శానిటైజర్లు వాడనప్పటికీ వారికి కరోనా భయం లేదు.
ఎందుకో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదు.
ఇది ఎలా సాధ్యమైందని చాలా మంది నిపుణులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఆదివాసీ గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం, అడవుల్లో లభించే దుంపలు, కాయలు, ఆకులు, చింతపూలు ఆహారంగా తీసుకుంటుంటారు.
అడవుల్లో లభించే విప్ప పువ్వు, కాయలు వాడుతారు.విప్ప పువ్వును ఆహారంగా తీసుకుంటూ విప్ప కాయలను గానుగ పట్టి నూనె తయారు చేసుకుంటున్నారు.దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని మనుబోతులగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇక్కడి ఆదివాసీలు ఇతర గ్రామాలకు, శుభకార్యాలకు వెళ్లకపోవడం, ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితం కావడంతో కరోనాకు దూరంగా ఉన్నారు.చాలా మంది ఆదివాసీలు తెల్లవారుజాము నుంచి వ్యవసాయ పనుల్లో ఉండటంతో బయటకు వెళ్లే సమయం కూడా దొరకడం లేదు.
ఇప్పటికీ గిరిజన ఆచార వ్యవహారాలు గూడేలలో సాగుతున్నాయి. కాబట్టి బయటికి వెళ్లకపోవడం వల్ల వారికి కరోనా సోకలేదని కొందరు తెలుపుతున్నారు.
అడవిలో దొరికే దుంపలు, ఆకుకూరలను తింటూ చింతపూలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు.తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మకాలు చేసి జీవనం సాగిస్తారు.
ఉదయన్నే గంజి తాగుతారు.గటక తింటారు.
గూడెం వాసులు ఎక్కువగా ఆకుకూర, బొద్దికూరలు, గురుజవెండి చెట్టు, పొత కాయలతో పచ్చడి చేసుకొని తింటారు.తాగునీటి అవసరాలను బోరుబావుల ద్వారా తీర్చుకుంటారు.
ప్రత్యేక పరిస్థితుల్లో తప్పా వీరు ఎక్కువగా మాంసాహారం తీసుకోరు.పప్పు దినుసులు, ఆకుకూరలే ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటాయి.
వేసవిలో మొక్కజొన్న అంబలి చాలా మంది తాగుతారు. వీరు ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండటం, ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఆ ఆదివాసీల గ్రామాలకు కరోనా చేరలేదని నిపుణులు వెల్లడించారు.