మన భారతదేశంలో రాజకీయ నేతలు ఎన్నికల నామినేషన్ల దాఖలు మొదలు గెలుపు వరకు వివిధ రకాలుగా ప్రజలను ఆకట్టుకుంటారు.గుర్రాలపై రావటం, ఒంటె పై ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వంటి వినూత్నమైన ఆలోచనలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా రాజకీయ నేతలు ముందు అడుగులు వేస్తూ ఉంటారు.
ఇక ఎన్నికల్లో గెలిస్తే వారి హంగులు ఆర్భాటాలు వేరే లెవెల్ లో ఉంటాయి.ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజకీయ నేతలు మందీమార్బలంతో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటారన్న విషయం తెలిసిందే.
అయితే మహారాష్ట్రకు చెందిన యాభయ్యేళ్ళ జలిందర్ గగరె అనే ఒక పారిశ్రామిక వేత్త అహ్మద్ నగర్ తాలూకాలోని తన సొంత గ్రామమైన అంబీదుమాలా కి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.బీజేపీ పార్టీ బలపరిచిన జలిందర్ అంబీదుమాలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు.
ఐతే వ్యాపారరీత్యా ఆయన పూణే లోనే నివసిస్తుంటారు.కానీ సర్పంచ్ గా ఎన్నిక కావడంతో ప్రమాణస్వీకారం చేసే రోజున ఆయన ఏకంగా హెలికాప్టర్ లో అంబీదుమాలా గ్రామానికి వచ్చారు.
దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందుగా గ్రామంలోని పలు దేవాలయాల పై హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించారు.
తదనంతరం ప్రమాణస్వీకారం చేయడానికి హెలికాప్టర్ నుంచి దిగిన జలిందర్ గగరె కి గ్రామస్తులు బాణాసంచా కాల్చుతూ ఘనస్వాగతం పలికారు.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.అయితే కేవలం సొంత గ్రామం అభివృద్ధి కొరకే తాను సర్పంచ్ పదవికి పోటీ చేశానని జలిందర్ గగరె స్పష్టం చేశారు.ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని.
అవసరమైతే తన సొంత డబ్బు ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.వృత్తిరీత్యా పూణేలో ఉంటున్నప్పటికీ.జలిందర్ కి గ్రామస్తులతో మంచి అనుబంధం ఉంది.ఏది ఏమైనా తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న జలిందర్ ని అందరూ తెగ పొగిడేస్తున్నారు.