కడప జిల్లాలో బ్రిటిషర్ల కాలం నాటి రిజర్వాయర్ ఒకటి బయటపడింది.పొలాల మధ్యలో ఉన్న దీనిపై రెండు అడుగుల వెడల్పుతో 8 రంధ్రాలున్నాయి.
దీంతో లోపలికి దిగి పరిశీలించగా 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా ఉంది.చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సమీపంలో ఈ రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి రావడంతో ప్రజలు భారీ ఎత్తున ఈ రిజర్వాయర్ ని చూసేందుకు తరలి వస్తున్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కడప జిల్లాను పాలించిన సమయంలో తాగునీటి కొరత ఏర్పడకుండా ఉండేందుకు భూమిలో బోర్లు వేసి.భూమిలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేసేవారు.
దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్ ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం గమనార్హం.కాగా, దీని నిర్మాణానికి కాంక్రీట్, సిమెంట్ వాడకుండా కేవలం గచ్చుతో నిర్మించారు.
కడప ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1890లో సంప్లా దీనిని నిర్మించారు.ఇందుకు సంబంధించిన శిలాఫలకం కూడా కనిపించింది.
ఇది రెవిన్యూ రికార్డుల్లో కూడా మంటినీటి ట్యాంక్ గా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
ఈ రిజర్వాయర్ లోపల పరిశీలించగా.ట్యాంకు లోపలికి నీళ్లు రావడానికి ఓ రంధ్రం… ట్యాంకు నుంచి బయటికి నీళ్ల తరలించేందుకు మరో రంధ్రం ఏర్పాటు చేశారు.లోపలి భాగంలో 11 వరసల్లో 44 వరకు గోతిక ఆర్చ్ లు కనిపిస్తున్నాయి.
వీటిని గవ్వసున్నంతో చేసిన గచ్చుతో నిర్మించినట్టు తెలుస్తోంది.గతంలో ఇక్కడ బొగ్గు ఇంజిన్ల ద్వారా నీటిని తరలించే వారని సిబ్బంది చెబుతున్నారు.
అయితే, ఆ తర్వాత బుగ్గవంక డ్యాంను ఏర్పాటు చేయడంతో ఈ రిజర్వాయర్తో పని లేకుండా పోయింది.ఫలితంగా మరుగున పడిపోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు అది వెలుగులోకి వచ్చింది.