బిడ్డ పుట్టిన తరువాత మొట్టమొదటగా చేసే ఫంక్షన్ ఏదంటే టక్కున ఎవరయినా గాని బారసాల అని అంటారు.ఎందుకంటే బిడ్డ జన్మించిన 21 రోజుల తరువాత సాంప్రదాయ బద్దంగా చిన్నపిల్లలకు బారసాల జరిపించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.
బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టుకుని ఎంతో ఘనంగా ఒక పండగలగా ఈ ఫంక్షన్ ను సెలెబ్రేట్ చేసుకుంటారు.ఎందుకంటే కుటుంబంలోకి కొత్తగా వారసుడో లేదంటే వారసురాలో వచ్చిందనే ఆనందంతో బారసాల ఫంక్షన్ బాగా చేస్తారు.
అయితే ఒక కుటుంబం మాత్రం చిన్న పిల్లల మాదిరిగా ఆవుకు పుట్టిన లేగదూడకు ఎంతో ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా బారసాల వేడుక నిర్వహించారు.ఏంటి లేగదూడకు బారసాల ఫంక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా కానీ ఈ విచిత్రం నిజంగానే జరిగింది.
అంతేకాకుండా ఆ లేగదూడకి జన్మనిచ్చిన ఆవు కడుపుతో ఉన్నప్పుడు దానికి చుట్టు పక్కల వారిని పిలిచి శ్రీమంతం కూడా చేశారట.అసలు ఇంతకీ ఈ వింత ఎక్కడ జరిగింది.
ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలంలో గల బీచ్ రోడ్డులోని డాబాల సెంటర్ లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యులు ఎప్పటినుంచో ఒక ఆవును పెంచుకుంటున్నారు.
ఆవును గోమాత లాగా భావించి దాని ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటున్నారు.అలాగే ఆ ఆవుకు బంగారం అనే పేరు కూడా పెట్టుకున్నారు.ఇలా ఎంతో ప్రేమాభిమానాలతో పెంచుకుంటున్న బంగారం జులై 6వ తేదీన ఒక లేగ ఆడ దూడకు జన్మనిచ్చింది.ఆ లేగదూడను చూడగానే నిజంగానే వాళ్ళ ఇంట్లోకి మనవరాలు వచ్చిందని భావించారట.
మనవరాలు పుడితే ఎలా అయితే బారసాల ఫంక్షన్ చేస్తారో అలాగే ఆ లేగ దూడకు కూడా బారసాల ఫంక్షన్ ని ఘనంగా జరిపించారు.వాళ్ళ ఇంట్లో ఒక ఊయలను కట్టి, దానిని పూలతో ఎంతో అందంగా డెకరేషన్ కూడా చేసారు.ఆ తరువాత సాంప్రదాయబద్ధంగా ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ అందజేసి, మంగళహారతులు ఇచ్చి లేగదూడను ఉయ్యాలలో ఉంచి ముత్తయిదువులతో ఉయ్యాల పాటలు పాడించారు.బారసాల ఫంక్షన్ కి వచ్చిన చుట్టాలకి అలాగే చుట్టుపక్కల వారికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
బంగారంను మేము మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నాము అందుకే ఇలా ఫంక్షన్ చేసామని ఆవు యజమానురాలు మైథిలి తెలిపారు.