పాకిస్తాన్లోని బలూచిస్తాన్ సముద్ర తీరంలో చేపలు పడుతున్న గ్వాదర్ జిల్లా మత్స్యకారులు అబ్దుల్ హక్, ఆయన సహచరులు తమ వలలో ఒక క్రోకర్ చేప కనిపించడంతో సంబరాలు చేసుకున్నారు.బరువు, పొడవు విషయానికి వస్తే ఆ చేప అంత పెద్దదేం కాదు.
కానీ అది చాలా విలువైనది.అందుకే వాళ్లిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తీరానికి వచ్చి, మార్కెట్ వైపు పరుగులు తీశారు.26 కిలోల బరువున్న ఆ క్రోకర్ చేప ధర 7 లక్షల 80 వేలు పలికిందని అబ్దుల్ హక్ కజిన్ రాషిద్ కరీమ్ బలోచ్ తెలిపారు.“ఈ చేపను పట్టుకోడానికి రెండు నెలలు కష్టపడ్డాం.ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈ చేప దొరకగానే మాకు పండగలా అనిపించింది” అని రాషిద్ కరీమ్ తెలిపారు.
ఇంత విలువైన ఈ చేపను ఇంగ్లిష్లో ‘క్రోకర్’, ఉర్దూలో ‘సవా’, బలూచీలో ‘కుర్’ అంటారు.
జీవానీ తీర ప్రాంతంలోని సముద్రంలో ఈ చేప పడినట్లు వాళ్లు తెలిపారు.ఇది గ్వాదర్ జిల్లాలో ఇరాన్ సరిహద్దులకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఈ చేపల వేట రెండు నెలలే ఉంటుందని, అందుకే దీనికోసం తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని రాషిద్ కరీమ్ చెప్పారు.
వేలంలో ఈ చేపకు కిలోకు 30వేల చొప్పున ధర వచ్చింది.క్రోకర్ చేపలు ఇంకా బరువుగా, చాలా పెద్దవి కూడా ఉంటాయని రాషిద్ కరీమ్ చెప్పారు.“కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తికి ఇంకా బరువున్న ఒక క్రోకర్ చేప దొరికింది.అది రూ.17 లక్షలకు అమ్ముడైంది.కానీ అబ్దుల్ హక్, ఆయన సహచరులు పట్టుకున్న ఈ చేప బరువు 26 కిలోలే ఉంది” అన్నారు కరీమ్.“మార్కెట్లో ఈ చేపకు వేలం నిర్వహించగా.చివరకు ఒక వ్యక్తి కిలోకు రూ.30 వేలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.అలా దీనికి 26 కిలోలకు మొత్తం 7లక్షల 80 వేలు వచ్చాయి” అని ఆయన తెలిపారు.