అన్నీ అవయవాలు సక్రమంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నా కూడా వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేయడం అంటే సగటున సామాన్యుడికి తల ప్రాణం తోకకి వస్తుంది.కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తాన్య ధగా అనే ఒక యువతి తనకు కుడి కాలు లేకపోయినా.
ఓ సైకిల్ పైన 3,800 కిలోమీటర్లు ప్రయాణించి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.ఆమె కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 3,800 కిలోమీటర్ల ప్రయాణించడానికి 43 రోజులపాటు సైకిల్ నిర్విరామంగా తొక్కారు.
ఈ అరుదైన ఫీట్ ని ఛేదించాలంటే మానసిక బలం తో పాటు ఎంతో శారీరక బలం కావాల్సి ఉంటుంది.రెండు కాళ్ళు బలంగా ఉన్నా కూడా 43 రోజుల్లో 3,800 కిలోమీటర్లు సైకిల్ తొక్కటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే.
అయితే ఈ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తనకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహాయం చేసిందని తాన్య ధగా చెబుతున్నారు.బిఎస్ఎఫ్ సహకారంతో నడిచే ఆదిత్య మెహతా ఫౌండేషన్ సభ్యులు భారత దేశ వ్యాప్తంగా దివ్యాంగులు అయిన విద్యార్థులకు పారాస్పోర్ట్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు.
అలాగే విరాళాలు సేకరించి దివ్యాంగులు అయిన విద్యార్థులకు పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ని నిర్వహిస్తారు.అందులోని భాగంగానే ఇన్ఫినిటీ రైడ్ పేరిట ప్రతి సంవత్సరము కూడా సైక్లింగ్ పోటీ నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం “ఇన్ఫినిటీ రైడ్ కె2కే 2020” పేరిట నిర్వహించిన పారా సైక్లింగ్ పోటీలో తొమ్మిది మంది పాల్గొనగా వారిలో తాన్య ధగా ఒకరు.
అయితే ఈ పారా స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొన్న తాన్య దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసి వికలాంగులైనా, సరే.సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.నిజానికి తాన్య ఒక కారు యాక్సిడెంట్ లో తన కుడికాలిని కోల్పోయినప్పుడు తన తండ్రి ఆమెను బాగా ప్రోత్సహించి ప్రతి పరిస్థితిని పాజిటివ్ కోణంలో చూడాలి అని చెప్పారట.
అయితే కేవలం తన తండ్రి మాటలతోనే మళ్లీ తన జీవితాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించానని ఆమె అంటున్నారు.ఇన్ఫినిటీ రైడ్ లో సైకిల్ తొక్కుతున్న సమయంలో తాన్య తండ్రి చనిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న తాన్య హుటాహుటిన తన సైకిల్ యాత్ర నుంచి బ్రేక్ తీసుకొని తన తండ్రిని కడసారి చూసి మళ్ళీ సైకిల్ యాత్రను ప్రారంభించారు.