టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న అధిపత్యపోరుని తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణాలో అధికార పీఠం దక్కించుకోవాలి అనే అభిప్రాయంలో ఉంది బీజేపీ.కాంగ్రెస్ బలహీన పడుతుండడంతో ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది.
ఇక కాంగ్రెస్ తెలంగాణాలో తమ పట్టు జారిపోకుండా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్న్యాయం తామే అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.
దీని కోసం దుబ్బాక ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తోంది.ఇది ఇలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు మాజీ ఎంపీ విజయశాంతి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె సరైన రాజకీయ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వంపై అడుగడుగున విమర్శలు చేస్తూ, ప్రతి దశలోనూ కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసే విధంగా రాములమ్మ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
గతంలో ఆమె టిఆర్ఎస్ ఎంపీగా గెలవడం, ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో, ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు.ఇక అప్పటి నుంచి కేసీఆర్ తీరును ఎండగడుతూ వస్తున్నారు.
తాజాగా ఆమె తెలంగాణలోని అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో, ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలోనే అక్కడ బరిలోకి దిగాలని చూస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని, దుబ్బాక ను తమ కంచుకోటగా చేసుకోవాలని విజయశాంతి చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక గ్రామీణ ప్రాంతం కావడంతో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఎక్కువని, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సరైన అభ్యర్థి లేకపోయినా, రెండో స్థానంలో నిలవడం దీనికి నిదర్శనమని రాములమ్మ అంచనా వేస్తోంది.దుబ్బాక లో టిఆర్ఎస్ ను ఓడించడం ద్వారా, కేసీఆర్ పరిపాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అనే విషయాన్ని హైలెట్ చేయాలని రాములమ్మ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విజయశాంతి పోటీ చేయాలని ఈ విధంగా లెక్కలు వేసుకుంటూ ఉండగా, కాంగ్రెస్ ఈ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదట.