బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య రోజు రోజుకీ రకరకాల మలుపులు తిరుగుతోంది.సుశాంత్ మరణం బాలీవుడ్ నే కాదు యావత్ దేశాన్నే కలచి వేసింది.
ఈ ఘటనను ఉద్దేశించి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి విజయశాంతి గారు తాజాగా స్పందించారు.సుశాంత్ కేసులో దోషుల్ని శిక్షించేందుకు ప్రభుత్వాలు చాల మంచి ప్రయత్నాలే చేస్తున్నాయని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్ పైన సంచలన ఆరోపణలు చేసారు.ఒకానొకప్పుడు తెలుగు సినీ రంగంలో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండేవని, ఎందరో మహిళా నటులు ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయా కేసులకు సంబంధించి ఈ మాదిరి దర్యాప్తులు జరిగి ఉంటే వారి ఆత్మకు బహుశా శాంతి కలిగి ఉండేదని పేర్కొన్నారు.ఆనాడు ఏదో ఫార్మాలిటీగా సదరు కేసులను తూతూ మంత్రపు విచారణలతో చివరికి మమ అనిపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే సుశాంత్ కేసులో ప్రతి రోజు కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయ ప్రక్రియ ఒకే మాదిరి ఉండాలన్న ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యాఖ్యలను ఈ సందర్భంగా సూపర్ యాక్ట్రస్ విజయశాంతి గారు ఉదహరిస్తూ పాయింట్ చేశారు.
దర్యాప్తు సంస్థల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితం రాని సమయాల్లో ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్లకపోవడం వల్ల ఎన్నో కేసులు ఇలా నీరు గారిపోతున్నాయని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఏదో జరిగిపోయింది… ఇకపై కూడా అలాంటి చర్యలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు.