ఇటీవల నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపు తమ ఖాతాలో వేసుకునేందుకు సెంటిమెంటును సైతం పక్కనపెట్టి నోముల నరసింహ కుటుంబ సభ్యులను కాకుండా మరో బలమైన నేత కోసం వెతుకులాట మొదలు పెట్టడమే కాకుండా, ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తూ, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మరోసారి గెలిచి చూపించాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
ఇదిలా ఉంటే బిజెపి మాత్రం ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డికి వివిధ ఆఫర్లు ప్రకటిస్తూ బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ఒకపక్క చేస్తూనే వస్తోంది.అయితే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో నియోజకవర్గంలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ముద్ర వేయించుకున్న విజయశాంతిని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పోటీకి దింపితే ఎలా ఉంటుందనే విషయం పైన ఇప్పుడు బిజెపి కసరత్తు చేస్తోంది.
విజయశాంతి సినీ గ్లామర్ తో పాటు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఆ పార్టీ నాయకుల పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంలో ఆమె పేరు పొందారు.అక్కడ గట్టిపోటీ టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలంటే ఆమె సరైన అభ్యర్థి అనే వాదన ఇప్పుడు బిజెపిలో మొదలైందట.దీనిలో భాగంగానే విజయశాంతిని నాగార్జునసాగర్ బరిలోకి దింపితే ఫలితం ఎలా ఉంటుందనే విషయం పైన బిజెపి అంతర్గతంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం.విజయశాంతిని పోటీకి దించే విషయంలో నల్గొండ జిల్లా నాయకులు సైతం సముఖంగా ఉండడం, ఆమె అయితేనే పోటీ వాడి వేడిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, విజయశాంతి వైపు బీజేపీ అధిష్టానం పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.