తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రస్తుతం బీజేపీ లో యాక్టివ్ గా ఉంటున్నారు.అదే పనిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.
కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశం దొరికినా, వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తూ వస్తున్నారు.గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు.
ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీలో ఇమడలేక బిజెపి వైపు వెళ్లిన ఆమె, ఇప్పుడు ఆ పార్టీలో ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు.బిజెపి పెద్దల దృష్టిలో పడి కీలకమైన పదవిని సంపాదించాలని ఆరాట పడుతున్నారు.
దీనిలో భాగంగానే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా, టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ వంటి వారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో, వారి దృష్టిలో పడేందుకు విజయశాంతి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
అందుకే మిగతా నాయకుల కంటే స్పీడ్ గా ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో యాక్టివ్ రోల్ పోషిస్తూ, బిజెపి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ తమ రాజకీయ ప్రత్యర్థుల పై విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో యాక్టివ్ గా జనాల్లో తిరుగుతూ పాలిటిక్స్ చేసే అవకాశం లేకపోవడంతో, సోషల్ మీడియాని ఆమె నమ్ముకున్నారు.
ఆమె సోషల్ మీడియా లో పెట్టె పోస్టింగ్స్ బిజెపి అగ్రనేత ల దృష్టిలో పడే విధంగా చూసుకుంటున్నారు.మోదీ ఫర్ ఇండియా… మార్పు కోసం కమలం అనే క్యాప్షన్ పెట్టి మరి ఆమె పోస్టింగ్స్ పెడుతుండడం కొత్త చర్చకు దారితీస్తోంది.
తెలంగాణలో బిజెపి తరఫున కీలకమైన నాయకులు ఎంత మంది ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.బిజెపి తరఫున కెసిఆర్ కు కౌంటర్ లు ఇచ్చే వ్యక్తిగా అధిష్టానం తనను గుర్తించాలనే భావన విజయశాంతి లో కనిపిస్తోంది అనే పొలిటికల్ సెటైర్లు ఆమె పై పడుతున్నాయి.