రాములమ్మ విజయశాంతి రాజకీయ జీవితం డైలమాలో పడినట్లుగా కనిపిస్తోంది.ఆమె కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండగా, ఆ పార్టీ నాయకులు సైతం ఆమెను దూరం దూరంగా పెడుతూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఆమెకు ఆ పార్టీ నాయకులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్టుగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు ఆమెకు చాలా కాలంగా ఆగ్రహం కలిగిస్తున్నాయి.కీలకమైన పార్టీ సమావేశాలకు సైతం ఆమెను పిలవకపోవడంతో ఆమె మనస్తాపం చెందుతున్నట్టుగా కనిపిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం దుబ్బాక నియోజకవర్గం లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.ఈ మేరకు ఆమె కూడా కాస్త యాక్టివ్ అయినట్లుగానే కనిపించారు.
అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆమె మళ్ళీ సైలెంట్ అయిపోయారు.
ఆమె పోటీ చేస్తారని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆమెను సంప్రదించగా, తనకు పోటీ చేసే ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చేయడంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసిపోయింది.ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ గట్టిగా కష్టపడుతోంది.ఇక్కడ గెలిచి తీరాలనే కసి కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.
ఈ మేరకు టీఆర్ఎస్ బీజేపీలను ధీటుగా ఎదుర్కొని తన సత్తా చాటాలని చూస్తున్న కాంగ్రెస్ ఈ మేరకు దుబ్బాక నియోజక వర్గంలో ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరికీ బాధ్యతలు అప్పగించింది.
ఒక్కో మండలానికి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు నేతలను ఇంచార్జిలుగా నియమించింది.
మొత్తం ఎనిమిది మండలాలకు 32 మంది పేర్లతో జాబితాను సైతం విడుదల చేయగా, ఆ జాబితాలో విజయశాంతి పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆమె పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతోనే ఆమె పేరును ఈ జాబితాలో చేర్చలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకునే అవకాశం లేదని, ఈ గ్రూపు రాజకీయాల్లో తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంగానే ఉంటుందనే అభిప్రాయంలో విజయశాంతి ఉన్నారట.ఈ మేరకు బీజేపీ లోకి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా విజయశాంతి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు త్వరలోనే విజయశాంతి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.