వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పేది ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం విజయసాయిరెడ్డి.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ఆ స్థాయిలో వ్యవహారాలు చేస్తూ ఉంటారు.
ఎవరికి ఏ పదవి ఇప్పించాలన్నా, ఎవరిని ఏ పదవి నుంచి తొలగించాలన్నా, విజయసాయిరెడ్డి మాత్రమే చూసేవారు.అలాగే ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టడం, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా మెలుగుతూ, ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇలా అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసుకుంటూ వచ్చారు.
కానీ కొద్ది రోజులుగా ఆయన ప్రాధాన్యత తగ్గించినట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఆయనను కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం చేసేలా పార్టీ బాధ్యతలను అప్పగించారు.
గతంలో మాదిరిగా ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానూ కనిపించడం లేదు.ఈ విషయమై అధికార పార్టీలో తీవ్రస్థాయిలో నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే ఆయనకు ఢిల్లీ వ్యవహారాల్లోనూ, ఇప్పుడు కోత పెట్టినట్టుగా కనిపిస్తోంది.ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు చూసేందుకు తప్పనిసరిగా ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అత్యంత సన్నిహితమైన వారిని నియమించుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ పదవికి క్యాబినెట్ రాంక్ కూడా ఉంటుంది.వీరు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ ఉంటారు.
ఏడాది క్రితం వరకు ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉండేవారు.అప్పట్లో ఈ వ్యవహారంపై విమర్శలు రావడం, లాభాపేక్ష కలిగిన పోస్టుల్లో ఎంపీలు ఉండకూడదనే నిబంధన ఉన్నా, జగన్ విజయసాయిరెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు.ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఆ పదవిని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లాం కు ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండడంతో విజయసాయిరెడ్డి అధికారాలకు కాస్త కోత పడినట్లుగా కనిపిస్తోంది.ఆకస్మాత్తుగా అజయ్ కల్లాం పేరు తెరపైకి తీసుకురావడం వెనుక కారణాలు తెలియనప్పటికీ, విజయసాయిరెడ్డికి వరుసగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత తగ్గిస్తూ ఉండడంపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతుంది అనే విషయంపై ఆరా తీస్తున్నాయి.ఇప్పటి వరకు నెంబర్ 2 స్థానంలో కొనసాగినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుగానే కనిపిస్తోంది.
ఇప్పటికే విజయసాయిరెడ్డి వ్యవహారంలో జగన్ కు అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఈ స్థాయికి రావడం, వివాదం అవ్వడానికి కారణం విజయసాయిరెడ్డి సరిగ్గా ఆ వ్యవహారాన్ని డీల్ చేయకపోవడమే కారణం అని జగన్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది.
ఇవే కాకుండా, అనేక విషయాల్లో ఆయన వ్యవహారశైలిపై విమర్శలు రావడంతోనే ఆయన పదవులకు కోత పడుతున్నట్టు అర్ధం అవుతోంది.