వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు ఏదో ఒక సందర్భంలో వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కామెంట్స్ చేస్తూ ఉండడం ఆ పార్టీ అగ్రనేతలకు ఆగ్రహం కలిగిస్తోంది.అయినా ఆయన వ్యవహారాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు బిజెపి పైన ఒత్తిడి పెంచుతున్నారు.
అయినా రఘురామ మాత్రం వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన కోర్టుల్లో పిటిషన్ వేస్తూ.
కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తూ వైసిపి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారారు.అంతేకాకుండా టీవీ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీకి ఎంత నష్టం చేకూర్చాలో అంతా చేస్తున్నారు. ఇక బీజేపీ అగ్ర నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వైసీపీని కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.ఆయన పై ఇప్పటికే జగన్ హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ కి ఫిర్యాదు చేశారు.
అయినా పరిస్థితి లో ఏ మార్పు లేదు.ఈ వ్యవహారాలను మొదట్లో పెద్దగా పట్టించుకోనట్టుగా కనిపించినా.ఆయన విమర్శలు మరీ శృతిమించడంతో తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు .రఘురామకృష్ణంరాజు ను టీవీ చర్చా కార్యక్రమాలకు అనుమతించవద్దని సంసద్ టీవీ సీఈఓ కు విజయసాయి రెడ్డి లేఖ రాశారు.టీవీ చర్చల్లో రఘురామను వైసీపీ ఎంపీగా చూపిస్తున్నారని , ఆయన వైసిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని ఆ లేఖలు పేర్కొన్నారు.
ఆయనపై అనర్హతకు సంబంధించిన పిటిషన్ లోక్ సభ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని, అది తేలేవరకు ఆయనను చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.అయితే ఈ లేఖ పై రఘురాం కృష్ణంరాజు ఘాటుగా స్పందించారు.తనను కావాలంటే పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసిరారు.