అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం గత బుధవారం యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.
ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.
బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనతో ట్రంప్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు.
చట్టసభ సభ్యులైతే జనవరి 20కి ముందే పదవిలోంచి దించేందుకు పావులు కదుపుతున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.
అయితే ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడికే ట్విట్టర్ షాకివ్వడం చర్చనీయాంశమైంది.తన ట్వీట్ల ద్వారా హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆయన ఖాతాను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
అయితే ట్విట్టర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక ఆ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దె కీలక పాత్ర పోషించారు.ట్విట్టర్లో టాప్ పాలసీ మేకర్గా, లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారు.హైదరాబాద్లో జన్మించిన విజయ కుటుంబం ఆమెకు మూడేళ్ల వయసున్నప్పుడు అమెరికాకు వలస వెళ్లారు.టెక్సాస్, న్యూజెర్సీల్లో ఆమె బాల్యం గడిచింది.కార్నెల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.అనంతరం న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్నారు.
2011లో ట్విట్టర్లో చేరిన విజయ క్రమంగా టీమ్ లీడర్గా ఎదిగారు.ట్విట్టర్లో భద్రతాపరమైన నిర్ణయాలు, విధానాలను రూపొందిస్తున్నారు.350 మంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ నాయకత్వం వహిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ట్విట్టర్లో పోస్టయ్యే వ్యాఖ్యానాలు, వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఈ విభాగానిదే.
ట్విట్టర్లో చేరకముందు జూనిపర్ నెట్వర్క్స్, విల్సన్ సోన్సినీ గుడ్రీచ్ అండ్ రోసాటి సంస్థలకు న్యాయ సేవలందించారు విజయ.ఇక గత దశాబ్ధ కాలంగా ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఆమె కీలక పాత్ర పోషించారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను అమ్మకూడదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని ఒప్పించడంలో గద్దె విజయ క్రియాశీలకంగా వ్యవహరించారు.
.