ఏప్రిల్ 6న చెన్నైలో ఎన్నికల పోలింగ్ సమయంలో స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ సైకిల్ పై ఓటు వినియోగించుకోవడానికి వెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎవరికి తోచినట్లు వారు కథనాలు అల్లేశారు.
హీరో విజయ్ మొదటి నుంచి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా ముద్ర ఉంది.ఈ నేపధ్యంలో డీఏంకె పార్టీ నాయకులు విజయ్ సైకిల్ పై వెళ్ళిన ఫోటోని తమకి అనుకూలంగా వాడుకున్నారు.
కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా ఇలా సైకిల్ పై ఓటు వేయడానికి వెళ్లి తన నిరసన తెలియజేశారని ప్రచారం చేశారు.ఇక ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీజేపీ పార్టీని వ్యతిరేకించే అందరూ కూడా విజయ్ చాలా గొప్ప పని చేశాడంటూ ఆ ఫోటోని షేర్ చేస్తూ బీజేపీ పార్టీకి సరైన పద్ధతిలో నిరసన తెలియజేశాడని ప్రశంసలు కురిపించారు.ఇక ఏపీలో కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉండేవారు విజయ్ ఫోటోని, పవన్ కళ్యాణ్ రాజకీయాలని పోల్చి ప్రశ్నించడం అంటే ఇలా అని అతన్ని ఆకాశానికి ఎత్తేశారు.
బీజేపీ పార్టీ నాయకులు కూడా విజయ్ ఫోటోలపై కౌంటర్ లు ఇచ్చారు.
అయితే విజయ్ పోలింగ్ సమయంలో ఓటు వినియోగించుకోవడానికి సైకిల్ పై వెళ్ళడానికి కారణం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిరసన కోసం కాదని విజయ్ అసిస్టెంట్ వెల్లడించారు.
పోలింగ్ బూత్ ఉన్న ఇరుకైన వీధిలో పార్కింగ్ సమస్యలను నివారించడానికి తాను అలా చేశారని విజయ్ సన్నిహిత ప్రచారకర్త స్పష్టం చేశారు.దళపతి విజయ్ కారును ఉపయోగించకుండా సైకిల్ ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఎందుకంటే పోల్ బూత్ తన నివాసం పక్కనే ఉంది.కారు తీసుకోవటం రహదారిని మరింత రద్దీగా మార్చేసి ఉండవచ్చు.
దీని వెనుక వేరే ఉద్దేశ్యం లేదు అని రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు.దీంతో విజయ్ చేసిన పనిని బీజేపీని డ్యామేజ్ చేయడానికి ఉపయోగించాలని ప్రయత్నం చేసిన అందరికి ఈ ఒక్క ట్వీట్ తో గాలి తీసేసినట్లు అయ్యిందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది.