భారతదేశంలో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇప్పుడు విదేశాల్లో ఉంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కి ఆదివారం ఊహించని పరిణామం ఏర్పడింది.వేలకోట్లు ఎగ్గొట్టిన ఈయన గారు ఆదివారం లండన్ లోని ఓవల్ వేదికగా జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ చూడడానికి మైదానానికి వచ్చారు.
అయితే మాల్యా ను చూడగానే అక్కడున్న జనం చోర్-చోర్ అని అరవడం మొదలు పెట్టారు.అంతేకాకుండా దేశానికి క్షమాపణలు చెప్పు అంటూ కూడా పలువురు నినాదాల చేయడం తో స్టేడియం మారుమ్రోగింది.
అంతే ఇక లిక్కర్ కింగ్ గారు అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నారు.ఈ క్రమంలో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించినప్పటికీ నేను కేవలం మ్యాచ్ చూడడానికి వచ్చాను అని చెప్పాడు.
అంతేకాకుండా జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని కూడా చెప్పిన మాల్యా తన తల్లి (దేశం) బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నం అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
మరోపక్క విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి.అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని, అంతేకాకుండా భారతీయ జైళ్లు సురక్షితంగా కాదంటూ కోర్టు లో మాల్యా తరపు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు.అయితే దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుంది.
దీనికి సంబంధించి లండన్ హై కోర్టులో జూలై 2న విచారణ ఉంది.విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.