టాలీవుడ్ను ఈమద్య వణికిస్తున్న విషయం లీక్.మొన్నటి వరకు పైరసీ భయం వెంటాడటం జరిగింది.
సినిమా విడుదలైన రోజే లేదంటే రెండు మూడు రోజుల్లోనే పైరసీ వచ్చేస్తుంది.ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో టాలీవుడ్ నిర్మాతలు వణికి పోతున్నారు.
ఈ సమయంలోనే విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ఇటీవలే గీత గోవిందం మరియు అరవింద సమేత చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షం అయిన విషయం తెల్సిందే.
తాజాగా ట్యాక్సీవాలా చిత్రంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
ట్యాక్సీవాలా చిత్రం ఇంకా ఎడిటింగ్ను కూడా పూర్తి చేసుకోలేదు.ఇంతలోనే సినిమాకు సంబంధించిన వీడియో గూగుల్ డ్రైవ్ ద్వారా లీక్ అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గుర్తించారు.వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిత్ర యూనిట్ సభ్యులు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
గీత గోవిందం చిత్రంకు వ్యవహరించినట్లుగా వెంటనే వీడియోను డిలీట్ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు.దాంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
‘ట్యాక్సీవాలా’ చిత్రానికి సంబంధించిన వీడియోలు గూగుల్ డ్రైవ్లో రెల్ల కమల్, భార్గవ్, బీఆర్ల పేర్లతో షేర్ అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం వారు ఎవరు, ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అంటూ గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
త్వరలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
సినిమా విడుదల కాకుండానే ఈమద్య సీన్స్ లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులకు కంటిమీద కునుకు ఉండటం లేదు.ఎటువైపు నుండి లీక్ వీరులు దాడి చేస్తారో అంటూ ఆందోళనతో గడిపేస్తున్నారు.ట్యాక్సీవాలా చిత్రంను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
లీక్ అయిన నేపథ్యంలో సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.