టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ అవుతుండటంతో ఆయన చేసే ప్రతి పని గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘రౌడీ’ అనే బ్రాండ్తో బట్టల వ్యాపారం చేస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా మరో వ్యాపారంలో విజయ్ అడుగుపెడుతున్నాడు.
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు అందించే వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీలో విజయ్ దేవరకొండ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యాడు.
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల సదస్సులో ఈ మేరకు కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని తెలియజేసింది.ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా చూసుకునే భాద్యత అందరిపై ఉందని, అందుకే తమ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు అందించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ఓనర్లు విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి తెలిపారు.
ఇక విజయ్ దేవరకొండ తమ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తమకు సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు.భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కానుండటంతో, ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విజయ్ దేవరకొండ తెలిపాడు.
హైదరాబాద్ వాసులు ఈ వాహనాలను అద్దెకు తీసుకుని తమ సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చని వారు తెలిపారు.మరి రౌడీ మొదలుపెడుతున్న ఈ కొత్త వ్యాపారం మనోడికి ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి.
ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ చిత్ర షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.