సంతలో పశువులను అమ్మిన చందంగా అక్కడ చిన్నారి పెళ్లి కూతుళ్లను అమ్మేస్తారు.13, 14 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను సుమారు రెండు లక్షల రూపాయలకే బేరం పెట్టేస్తారు.అయితే.ఆ సొమ్ములో పెళ్లికూతురికి మాత్రం నయాపైసా కూడా దక్కదు.చైనా యువకులు వారిని ఎగబడి కొనుక్కున్నా డబ్బులు మాత్రం అమ్మాయిలను విక్రయించిన స్మగ్లర్లే ఎగరేసుకుపోతారు.ఈ విఫమం అమ్మాయిల తల్లిదండ్రులకు ఎప్పటికీ తెలియనే తెలియదు కూడా.
అలా అంగడి బొమ్మల్లా అమ్ముడుపోయిన అమ్మాయిలు చైనా యువకులతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే.ఆ తర్వాత జీవితంలో తమ తల్లిదండ్రులను గానీ, పుట్టిన గడ్డను గానీ చూసే అవకాశం ఎప్పటికీ కలిగే అవకాశం ఏమాత్రమూ లేదు.
చైనా యువకులు, చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.పెళ్లి కూతురికి ఎదురుకట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు భరించడమే కాకుండా సొంతిల్లు ఉండాలి.
సొంతిల్లు లేనివారిని పెళ్లి చేసుకునేందుకు చైనా యువతులు ససేమిరా అంటారు.
స్త్రీ, పురుష నిష్పత్తిలో ఏర్పడిన తేడా కారణంగా చైనా అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
దశాబ్దాల తరబడి ఏక సంతాన విధానాన్ని చైనా ప్రభుత్వం పాటించడం వల్ల ఆ దేశంలో అమ్మాయిల కొరత బాగా ఎక్కువగా ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాలు విశ్లేషించాయి.ఈ కారణంగా చైనాలో పెళ్లి కూతుళ్లకు డిమాండ్ పెరిగింది.
దీన్ని అవకాశంగా తీసుకొని చైనాలో అక్రమ మానవ రవాణా ముఠాలు పుట్టుకొచ్చాయి.వారి కన్ను పొరుగునే ఉన్న వియత్నాం సరిహద్దు గ్రామాలపై పడింది.
చైనాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వియత్నాం బాలికలను దళారులు బుట్టలో పడేస్తారు.ఫ్రెండ్స్ పార్టీల పేరిట పిలిపించి మద్యం తాగిస్తారు.
డ్రగ్స్ ఇస్తారు.వారు ఆ మత్తులో ఉండగానే సరిహద్దు దాటించి చైనా సంతకు తీసుకుపోతారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా చదువుకుంటున్న వియత్నాం బాలికలకు దళారులు రంగుల ఎర వేస్తున్నారు.మీడియా ముందుకు వచ్చి తమ వ్యథార్థ గాధలను వినిపించిన లాన్, ఎన్-గుయన్ వియత్నాం నుంచి చైనాకు అలా చేరిన వారే.‘పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఓ రోజు ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు.బలవంతంగా మద్యం తాగించారు.
ఇంటికెళ్తానంటే వారించి అక్కడే పడుకోబెట్టారు.తెల్లవారి లేచేసరికి కొత్త ప్రాంతంలో ఉన్నాను.
నేను ఎక్కడున్నానని వాకబు చేస్తే చైనాలో ఉన్నానని తెలిపారు.నా పక్కన మరికొంత మంది బాలికలు ఉన్నారు.
మా చుట్టూ వస్తాదుల లాంటి గార్డులు ఉన్నారు.ఎంత ప్రతిఘటించినా నన్ను ఓ చైనా యువకుడికి అమ్మేశారు’ అని 13 ఏళ్ల లాన్ తన గాధను తెలిపింది.‘నన్ను రెండు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టారు.నేను దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాను.
నన్ను చిత్రహింసలకు గురిచేశారు.అన్నం పెట్టకుండా మాడ్చారు.
చివరకు చంపేస్తామని బెదిరించారు.చేసేదేమీలేక అంగీకరించాను.
రెండు లక్షల ఐదువేల రూపాయలకు ఓ చైనా యువకుడికి నన్ను దళారులు అమ్మేశారు.ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను.
ఆయన నన్ను బాగానే చూసుకున్నారు.అయినా పుట్టిన దేశాన్ని, తల్లిదండ్రులను చూడకుండా ముక్కూ మొహం తెలియని వ్యక్తితో ఎలా కాపురం చేసేది? అడ్జెస్టు కాలేకపోయాను.నా ప్రతిఘటన మళ్లీ మొదలైంది.దాంతో నా అత్త స్మగ్లర్లను పిలిచి నన్ను వారికి అప్పగించింది.తాను వారికి అంతకు ముందు చెల్లించిన డబ్బులు వెనక్కి తీసుకుంది.నన్ను తిరిగి వియత్నాం పంపించాలని స్మగ్లర్లను వేడుకున్నాను.
వారు వినకుండా మరో చైనా యువకుడికి నన్ను అమ్మేశారు.కథ మళ్లీ మొదటికొచ్చింది’ అని 16 ఏళ్ల ఎన్-గుయన్ వివరించింది.