మానవుల్లో కూడా మృగాళ్లు ఉంటారని చెప్పడానికి నిదర్శనంగా మరొక వీడియో నిలుస్తోంది.మూగ జీవులను హింసించడం పాపమని జంతు ప్రేమికులు ఎన్నో సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తున్న కూడా కొందరు మాత్రం మారడం లేదు.
జాలి, దయ, కనికరం లేకుండా జంతువులను చాలా క్రూరంగా హింసిస్తున్నారు.భారతదేశంలో కఠినమైన చట్టాలు తెస్తే కానీ జంతువుల పై జరిగే క్రూరత్వానికి తెరపడదని ఎందరో మొరపెట్టుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా కఠిన చట్టాలు తేలేకపోతున్నారు.
కఠిన చట్టాలు వచ్చేంతవరకు మానవ మృగాళ్లు మూగజీవాలను హింసిస్తూనే ఉంటారని చెప్పవచ్చు.తాజాగా ఇద్దరు మావటివాళ్లు కూడా ఒక ఏనుగు ని అత్యంత దారుణంగా కొట్టి జంతు ప్రేమికుల ఆగ్రహానికి గురవుతున్నారు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని తెక్కంపెట్టిలో వినీల్ కుమార్(45), శివప్రసాద్(19) అనే ఇద్దరు మావటీలు శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ ఆలయానికి చెందిన 19 ఏళ్ల ఆడ ఏనుగును కోయంబత్తూరులోని రీహాబిటేషన్ సెంటర్ తీసుకొచ్చారు.ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు ఈ రీహాబిటేషన్ సెంటర్ లోనే ఏనుగులను ఉంచుతారు.ఐతే వినీల్ కుమార్, శివప్రసాద్ తాము తీసుకొచ్చిన ఏనుగు ని చెట్టు కి గొలుసులతో కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.కాళ్ళ పై బలమైన దెబ్బలు కొట్టడం తో ఆ నొప్పి తాళలేక ఆ ఏనుగు ఆర్తనాదాలు పెట్టింది.
అయినా కూడా ఏమాత్రం కనికరించకుండా ఆ ఏనుగును బాగా కొట్టారు.ఈ హృదయ వికారమైన దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్ వేదికగా షేర్ చేశాడు.
దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే ఈ వీడియో తెగ వైరల్ కావడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని వినీల్ కుమార్, శివప్రసాద్ లను అరెస్టు చేశారు.
విచారణలో వినీల్ కుమార్ మావటివాడే కాదని అతను ఓ మావటివాడి యొక్క బంధువు అని తేలింది.ఏనుగు చెప్పిన మాట వినడం లేదనే తాను చిత్రహింసలు పెట్టినట్టు అతడు ఒప్పుకున్నాడు.
దీనితో బాగా ఆగ్రహించిన ఉన్నత అధికారులు నిందితులిద్దరినీ సస్పెండ్ చేశారు.అలాగే ఆలయానికి చెందిన మిగతా ఏనుగులను ఎలా చూసుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.