ఒకప్పుడు ఫోన్ లు అంటే ఎక్కడో కొందరి వద్ద మాత్రమే ఉండేవి.అవి క్రమ క్రమంగా ప్రతి ఒక్కరూ వాడడం మొదలు పెట్టారు.
ఆ తరువాత జనరేషన్ మారింది ఫోన్ లు కూడా మారాయి.ఏండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసాయి.
అయితే ఇప్పడు ఈ ఏండ్రాయిడ్ మొబైల్స్ కూడా ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్నాయి.ఈ మొబైల్స్ కారణంగా స్వీయ చిత్రాలు,స్వీయ వీడియో లు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ కాలం గడిపేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో ఎక్కడ ఈ ఫోన్ లను ఉపయోగించాలి,ఎక్కడ ఉపయోగించకూడదు అన్న విచక్షణ కూడా మరచిపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు.సరిగ్గా జనగామ జిల్లా చిలువూరు లో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడు.
వీడియో రికార్డ్ చేస్తే చిక్కుల్లో పడతారా అని ఆలోచిస్తున్నారా.అతడు వీడియో తీసింది ఎదో ప్రకృతికి సంబందించినవో లేదా మరేవో కాదు.
ఏకంగా అతగాడు ఓటు వేసిన దృశ్యాలను వీడియో తీసి తన మిత్రులకు వాట్సాప్ ద్వారా పంపాడు.దానితో అయ్యగారు బుక్ అయ్యారు.దీనితో చిలువూరు కు చెందిన మహేష్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.ఇటీవల తెలంగాణా లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సమయంలో జెడ్పీటీసీ స్థానానికి చేతిగుర్తుకు ఓటు వేస్తున్న వీడియో రికార్డు చేసి దానిని మిత్రులకు షేర్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.దీనితో అక్కడి ఎస్సై శ్రీనివాస్ పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పేపర్ పై ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి మహేష్ అని తేలడం తో అతడిపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెన్ పల్లి లో ఓటు వేసి బ్యాలెట్ పత్రం ఫొటో తీసిన సందెల రవీందర్ అనే వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.