ప్రైవేటు బస్సులంటే అంతే.! వాటిని ఎక్కితేనే యమపురికి స్వాగతం చెప్పినట్టు అనిపిస్తుంది.
నిబంధనలను పాటించకుండా వారు బస్సులను నడిపిస్తారు.ఆ బస్సులను నడిపే డ్రైవర్లకు సరైన అవగాహన ఉండదు.
దీనికి తోడు డ్రైవింగ్ అంత బాగా ఏం ఉండదు.ఈ క్రమంలో వాటిలో ప్రయాణిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.
గమ్యస్థానం చేరే వరకు సురక్షితంగా ఉంటామని గ్యారంటీ ఉండదు.గతంలో ఎన్నో సంఘటనల్లో ప్రైవేటు బస్సులకు యాక్సిడెంట్లు అవడం మనం చూశాం.
అయితే ఇప్పుడు చెప్పబోయే సంఘటన కూడా అటువంటిదే.కాకపోతే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.కానీ… ప్రమాదం జరిగే లెవల్లో ఆ బస్సుల డ్రైవర్లు పోటీ పడి మరీ బస్సులను నడిపారు.దీంతో ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పడిన భయం అంతా ఇంతా కాదు.
అది తమిళనాడులోని కోయంబత్తూరు-పొల్లాచి జాతీయ రహదారి.ఆ రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.దీంతో తారు రోడ్డు చాలా తక్కువగా ఉంది.మొత్తం కంకరతోనే నిండి ఉంది.అయితే ఆ రోడ్డుపై ఇద్దరు ప్రైవేటు బస్సు డ్రైవర్లు పోటీ పడ్డారు.తొలుత ఓ బస్సు మరో బస్సును క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్ పక్కకు తొలగలేదు.
దీంతో ఏకంగా క్రాస్ చేయాలనుకున్న మరో బస్సు డ్రైవర్ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లాడు.ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో దుమ్మురేగిపోయింది.
ఇలా ఒకరిని ఒకరిని ఒకరు క్రాస్ చేస్తూ బైకు రేసు మాదిరిగా గాల్లో తేలిపోయే వేగంతో దూసుకెళ్లారు.ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనదారులకే కాదు, పక్కన వెళ్లే వారికి కూడా గుండె ఆగినంత పనైంది.
ఇక ఆ బస్సుల్లో ఉన్నవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.వారు అలా బస్సులు వేగంగా వెళ్లినంత సేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
అలా కొంత సేపు ఇద్దరు డ్రైవర్లు పోటీ పడ్డారు.కాగా వాటి వెనుకాలే వస్తున్న ఓ బైకిస్టు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టగా పెద్ద సంచలనం అయింది.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఆ బస్సు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు.మరోసారి ఇలా బస్సులను నడిపిస్తే పర్మిట్ రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు.
అవును మరి, అలాంటి వారిని అస్సలు ఉపేక్షించరాదు, కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే.ఏది ఏమైనా ఆ బస్సులకు ఏమీ కానందుకు అందరం సంతోషించాల్సిందే.!
.