దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు హిందువులే అయినా భారత్ అధికారికంగా హిందూ దేశం కాదు.ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం మన పొరుగున ఉన్న నేపాల్ మాత్రమే.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా మన రాజ్యాంగ నిర్మాతలు అభ్యుదయ భావాలు , ఉన్నత విలువలు ఉన్నవారు కాబట్టి దేశాన్ని లౌకిక దేశంగా మార్చారు.అంటే ఇది మత రాజ్యం కాదు.
అంటే ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంగాని లేదా తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంగాని జరగదు.అయితే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ హిందూత్వ సంస్థల భావజాలం మాత్రం వేరే విధంగా ఉంది.
ఇండియాను ‘హిందూ దేశం’గా ప్రకటించాలని సంఘ్ పరివార్ శక్తులు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పుడు తమవాడైన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేసరికి ఈ డిమాండ్ ఊపందుకుంది.
అందులోనూ భాజపా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కదా….! తాజాగా విశ్వహిందూ పరిషత్ ‘హిందూ రాజ్యం’ డిమాండ్ను ముందుకు తెచ్చింది.
రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి భారత్ హిందూ రాజ్యంగా మారుతుందని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ జోస్యం చెప్పారు.కేంద్రంలో మోదీ సర్కారు ఉందన్న ధీమాతో ఆయన ఈ జోస్యం చెప్పివుంటారు.
దేశం హిందూ రాజ్యం అవుతుందని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయో తెలియదు.అయోద్యలో ఇప్పటివరకు రామమందిరం కట్టడమే సాధ్యం కాలేదు.
అలాంటిది దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించడం సాధ్యమవుతుందా? ఒకవేళ అదే జరిగితే గొడవలు జరగవా? హిందూత్వ సంస్థల డిమాండ్లలో ప్రధానమైంది ‘గోవధ నిషేధం’.దీనిపై ఇప్పటికే దుమారం రేగుతోంది.
గోవధను దేశ వ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలని అశోక్ సింఘాల్ డిమాండ్ చేశారు.కాని భిన్న మతాలవారు, జాతుల వారు ఉన్న ఈ దేశంలో ఈ డిమాండ్ అమలు చేయడం సాధ్యమా?
.