పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న ఓ జంట, ఇక తమ ప్రేమ ఫలించే అవకాశం లేదన్న భావనతో వేములవాడ రాజరాజేశ్వరీ సన్నిధికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన వివాహిత రాచర్ల మౌనిక(26), బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సింగతి విష్ణువర్ధన్( 26) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
మంగళవారం ఉదయం బద్ది పోచమ్మ వీధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో వెలుగు చూసింది.వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది.
వివరాల లోకి వెళ్తే.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్కు చెందిన సింగతి విష్ణువర్ధన్ (26), బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన రాచర్ల మౌనిక (26) పదో తరగతిలోనే ప్రేమించుకున్నారు.
పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు.కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు వివాహమైంది.ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.ఇదంతా ఏడేళ్ల క్రితం నాటిమాట.
ఇటీవల భర్తతో విభేదాలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది.ఈ క్రమంలోనే చిన్ననాటి ప్రేమికుడు మళ్లీ కనిపించాడు.
మరోసారి ప్రేమ చిగురించింది.
మౌనిక, విష్ణువర్ధన్ కలిసి శనివారం వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చారు.బద్దిపోచమ్మ వీధిలో ఉన్న ఓప్రైవేట్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు.ఒకరోజు కోసం రూమ్ తీసుకున్న ఇద్దరు మరుసటిరోజు ఆదివారం అద్దెను పొడగించుకుని ఆ రూమ్లోనే గడిపారు.
సోమవారం రూం ఖాళీ చేయాలని లాడ్జీ నిర్వాహకులు ఆదేశించారు.మంగళవారం మొక్కులు చెల్లించుకునేది ఉందని చెప్పి మళ్లీ అద్దె పొడగించుకున్నారు.
రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వారు, నిన్న ఎంతసేపటికీ గది దాటి బయటకు రాలేదు.దీంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, గదిలో తనిఖీ చేయగా, మొత్తం విషయాన్ని బయటపెడుతూ సూసైడ్ నోట్ లభించింది.కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.