సినిమా ఇండస్ట్రీలో కథల దోపిడీ అనేది చాలా కాలం నుంచి ఉంది.ఎవరో రచయితలు రాసిన కథలని కాస్తా సినిమాటిక్ గా మార్చుకొని తమ కథలుగా దర్శకులు తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు.
అయితే సదరు ఒరిజినల్ కథా రచయితలు బయటకి వచ్చి చెప్పేంత వరకు వాస్తవాలు తెలియవు.అయితే గతంలో ఇలాంటి అనుభవాలు కొంత మంది రచయితలకు ఎదురైనా తరువాత మళ్ళీ ఆలాంటి పరిస్థితి రాలేదు.
అయితే ఈ మధ్య కాలంలో మరల కొంత మంది రచయితల కథలని దర్శకులు చోరీ చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గతంలో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాపై వేంపల్లి గంగాధర్ అనే రచయిత ఈ ఆరోపణలు చేశారు.
తాను రాసిన మొండి కత్తి కథని కాపీ కొట్టి అరవింద సమేత సినిమా తీసారని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.తనను త్రివిక్రమ్ ఎలా మోసం చేసింది, తాను రాసిన కథ కూడా అందులో ప్రస్తావించారు.
అప్పట్లో ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ రచయిత కేంద్ర బాల సాహిత్య అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు ఇదే రచయిత పుష్ప సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.తాను రాసిన ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు అనే పుస్తకాన్ని కాపీ కొట్టి పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సూచన అనుకోండి, సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి.ముందుగానే రాసి పెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి.తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి.నేను రాసిన తమిళ కూలీ కథ మొత్తం వాడేసుకోండి.
గత సంవత్సరం మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలును ఉడికించి వంట చేస్కోండి.కనీసం పేరు కూడా రిఫరెన్స్గా సినిమాలో వేయకండి.
ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి.మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం అంటూ ఆధారాలతో సహా ఫేస్ బుక్ వాల్పై తన బాధను చెప్పుకొచ్చాడు ఈ తెలుగు రచయిత.
మరి ఈ ఆరోపణలపై సుకుమార్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.