రాజస్థాన్ రాజకీయాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి.ప్రభుత్వం పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ వెనుక బీజేపీ ఉంది అని,అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొనడానికి బీజేపీ నే కారణం అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు సీఎం అశోక్ గెహ్లాట్ కు అండగా మాజీ సీఎం,బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తో పతనం అంచున ఉన్న అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని అధికారంలో నిలపడానికి వసుంధర రాజే ప్రయత్నం చేస్తున్నారు అంటూ బీజేపీ మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ(ఆర్ ఎల్ పీ) సంచలన ఆరోపణలు చేస్తుంది.
సంక్షోభం లో పడ్డ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఆమె అండగా ఉందని కాంగ్రెస్ లోని ప్రతి జాట్ ఎమ్మెల్యే కు ఆమె స్వయంగా ఫోన్ చేసి మరి గెహ్లాట్ కు మద్దతు ఇవ్వాలంటూ కోరుతుంది అంటూ ఆర్ ఎల్ పీ ఎంపీ హనుమాన్ బెనివాల్ గురువారం ట్వీట్ చేయడం గమనార్హం.రాజస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పలువురు బీజేపీ నేతలు పైలట్ కు పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి అంటూ వ్యాఖ్యలు చేసినప్పటికీ వసుంధర రాజే మాత్రం అక్కడ రాజకీయాలపై ఇప్పటివరకు స్పందించలేదు.
ఇలాంటి సమయంలో వసుంధర రాజే,సీఎం అశోక్ గెహ్లాట్ కు మద్దతుగా నిలుస్తుంది అని, దానికి సంబందించిన ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ బెనివాల్ ట్వీట్ చేయడం సంచలనం రేపింది.మరోపక్క అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి జారీ చేసిన అనర్హత పిటీషన్ పై సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టు లో గురువారం పిటీషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తుంది.
పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటీషన్ ను రద్దు చేయాలి అని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.ప్రభుత్వం పై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ సచిన్ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.
సచిన్ తో పాటు ఆయనకు మద్దతు గా నిలచిన మరో 18 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.