వరుణ్ తేజ్, అథర్యలు కీలక పాత్రల్లో నటించిన ‘వాల్మీకి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి కూడా టైటిల్ విషయంలో వివాదం రాజుకుంటూనే ఉంది.
ఈ చిత్రంకు టైటిల్ మార్చాలంటూ బోయ సంఘం వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మరింత పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు.
బోయ సంఘం వారితో కనీసం చర్చలు కూడా జరిపేందుకు ఆసక్తి చూపలేదు.దాంతో సినిమా విడుదల సమయంలో వారు రచ్చ మొదలు పెట్టారు.
నిన్న రాత్రి సమయంలో అనంతపురం మరియు కొన్ని ప్రాంతాల్లో ‘వాల్మీకి’ చిత్రం విడుదల చేయడానికి స్థానిక పోలీసులు అనుమతి నిరాకరించారు.ఒకవేళ వాల్మీకి చిత్రం విడుదలైతే బోయ సంఘానికి చెందిన వారు ఆందోళనలు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా విడుదలకు నో చెప్పడంతో హుటా హుటిన సినిమా టైటిల్ను మార్చుతున్నట్లుగా ప్రకటించారు.వాల్మీకి అనే టైటిల్కు బదులుగా గద్దలకొండ గణేష్ అనే టైటిల్తో విడుదల చేస్తున్నట్లుగా నిన్న రాత్రి అధికారిక ప్రకటన వచ్చింది.
స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయమై ప్రకటించారు.ప్రముఖులు పలువురు వాల్మీకికి మద్దతు తెలిపారు.కాని టైటిల్ మార్చితేనే సినిమా విడుదల అంటూ తేల్చి చెప్పడంతో చేసేది లేక చివరి నిమిషంలో వాల్మీకి యూనిట్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది.సినిమా ప్రమోషన్ కోసం విడుదల కోసం కొత్తగా కావాల్సిన థింగ్స్ను పంపిస్తామంటూ హరీష్ శంకర్ పోస్ట్ చేశాడు.
మొత్తానికి వాల్మీకి చిత్ర యూనిట్ పై బోయ సంఘం వారు గెలిచినట్లయ్యింది.