టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ తెలివితేటలు ఆషామాషీగా ఉండవు.ప్రతి విషయంలోనూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
తన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్ గా ఉంటూ వస్తున్నాయి.అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ, తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెంది 23 స్థానాలతో సరిపెట్టుకుంది.ఇక ఆ తర్వాత టిడిపి తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమై వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు.
అయితే వీరిని అలా వదిలివేయకుండా ఇప్పుడు ఇరుకున పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.దీనికి రాజ్యసభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు.
ఈ రోజు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా, వర్ల రామయ్యను అభ్యర్థిగా ప్రకటించింది.ఖచ్చితంగా వైసీపీ నాలుగు స్థానాల్లోనూ గెలుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.అయినా టిడిపి మాత్రం తమ పార్టీలో చేరితే బయటకు వెళ్లిపోయినా, నాయకులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రాజ్యసభ ఎన్నికల్లోకి దిగినట్టుగా కనిపిస్తోంది.
ఇప్పటికే పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.ఈరోజు ఉదయం 09 గంటల నుంచి 4 గంటల మధ్య రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి.
తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా, అభ్యర్థిని రంగంలోకి దించింది.ఇప్పటికే పార్టీకి దూరమైన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఈ ముగ్గురికి విప్ జారీ చేయడంతో, వారు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.ఓటింగ్ లో పాల్గొనకపోయినా విప్ వర్తిస్తుంది.ఈ ముగ్గురు విప్ ను ధిక్కరించినట్లయితే వారిపై అనర్హత వేటు వేసేందుకు టిడిపి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ పరిస్థితుల్లో ఈ రోజు జరగబోయే పరిణామాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.దీనిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ ఏ విధంగా స్కెచ్ వేసింది అనేది కూడా నేడు తేలిపోనుంది.
ఇక రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తరువాత పెద్ద ఎత్తున నాయకులు వైసీపీ బాట పట్టే అవకాశం ఉండడంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.