దొంగల్లో మంచి దొంగలు కూడా ఉంటారు.అయితే మంచి దొంగలు సినిమాలకే పరిమితం అవుతారని అంతా అనుకుంటాం.
దొంగ అంటేనే చెడ్డ వాడు, అలాంటప్పుడు మంచి దొంగ, చెడ్డ దొంగ ఎలా ఉంటాడు అనేది కొందరి వాదన.అలా వాదించే వారికి ఈ కథనం చూపిస్తే వారు దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారు అనే విషయం నిజమే అంటూ ఒప్పుకుంటారు.
తెల్లారి జరుగబోతున్న పెళ్లి గురించి ఆలోచించి ఆ దొంగ సగం నగలు మాత్రమే తీసుకు వెళ్లాడు.ఆ దొంగ పెళ్లి గురించి ఆలోచించి అలా సగం నగలు తీసుకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
ఈ విచిత్రమైన దొంగతనం ప్రపంచంలో ఏ మారుమూలనో జరగలేదు.తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే జరిగింది.హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన ఒక ఇంట్లో ఈ దొంగతనం జరిగింది.దొంగతనం జరిగిన విధానం పోలీసులకు కూడా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్లే… టోలీచౌకీకి చెందిన ఎజాజ్ అహ్మద్ ఇంట్లో పెళ్లి.ఆయన కూతురు వివాహంకు అంతా సిద్దం చేశారు.
ముందు రోజు కార్యక్రమం కోసం వరుడి ఇంటికి అంతా వెళ్లారు.ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకుండా పోయారు.
ఎజాజ్ అహ్మద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగ ఇంట్లో దూరాడు.బీరువాపై ఉన్న తాళంను తీసి, బీరువాలో ఉన్న బంగారంను చూశాడు.బీరువాలో మొత్తం 50 తులాల వరకు బంగారం ఉంది.ఆ 50 తులాల బంగారంలో 28 తులాల బంగారంతో పెద్ద నగలు చేయించగా, మిగిలిన 22 తులాల బంగారం చిన్న నగలు.28 తులాల పెద్ద నగల వరకు తీసుకు వెళ్లి 22 తులాల బంగారంను అలాగే ఉంచాడు.28 తులాల బంగారంతో పాటు బీరువాలో ఉన్న 1.20 లక్షల డబ్బును కూడా సదరు దొంగ తీసుకు వెళ్లాడు.ఆ దొంగ పెళ్లిలో వేసుకునే విధంగా 22 తులాల బంగారంను ఉంచడంతో పెళ్లి ఆగిపోకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయింది.
ఆ బంగారం పోయిట్లయితే పెళ్లి ఆగేదేమో అంటూ బంధువులు చెవులు కొరుక్కుంటున్నారు.బంగారం పోయిన విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మంచి దొంగ కోసం వెదుకుతున్నారు.ఇంట్లో వాళ్ల గురించి, ఇంటి గురించి తెలిసిన వారే ఇలా దొంగతనం చేసి ఉంటారనేది పోలీసుల అనుమానం.