తెలంగాణాలో తిరుగులేని అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చేదు ఫలితాలు ఎదురయ్యాయి.మొదటి నుంచి ఇక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగయ్యింది అనుకుంటుండగానే ఆ పార్టీలో చోటు చేసుకున్న గ్రూపు రాజకీయాలు చేదు ఫలితాలు మిగిల్చాయి.
ముఖ్యంగా సొంత పార్టీలో అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థులను ఓడించేందుకు ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలు పెరిగిపోయాయి.తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓడిన అభ్యర్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులన్నీ పొంగులేటి మీదే.
ఆయనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అభ్యర్థుల ఓటమికి కారణమైనట్టు వివరిస్తూ అధిష్ఠానానికి లేఖలు రాశారు.దీంతో సీఎం కేసీఆర్ ఆయనపై సీరియస్ గా ఉన్నట్టు ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరావు, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు, వైరా నుంచి పోటీ చేసిన మదన్లాల్, సత్తుపల్లి నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.అయితే, అందరూ తమ ఓటమికి కారణం ఎంపీ వర్గమేనని టీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.
ఈ ఫిర్యాదులతో ఖమ్మం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.ఓవైపు తెలంగాణలోని ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడీ కొత్త తలనొప్పి వచ్చిపడింది.
దీంతో పొంగులేటిని తప్పించి ఆ స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వీవీసీ మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ ను టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారట.
పోనీ పొంగులేటికే ఆ ఛాన్స్ ఇద్దామా అంటే ఆయన కారణంగా ఓటమి చవిచూసిన నాయకులు ఊరికే కూర్చోరని ఖచ్చితంగా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటారని కేసీఆర్ ఒక అంచనాకి వచ్చాడు.అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుని మరోసారి సత్తా చాటాలని కేసీఆర్ చూస్తున్నాడు.దీనిలో భాగాంగానే వంకాయలపాటి రాజేశ్వరావు ని తెరమీదకు తీసుకువచ్చి పొంగులేటి చెక్ పెట్టేందుకు సిద్ధం అయ్యాడనే వార్త పార్టీలో జరుగుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినా పొంగులేటి ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆరఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు ప్రస్తుతం తుమ్మల వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.
కావాలనే తుమ్మలతో సహా ఇతర అభ్యర్థులను పొంగులేటి ఓడించారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టాలనే వ్యూహంతో ప్రత్యర్థి వర్గాలు వంకాయలపాటిని తెరమీదకు తెచ్చినట్టు అర్ధం అవుతోంది .