లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే బాధితుల సంఖ్య లక్షల్లో ఉండగా.
కేంద్రం పంపే విమానాలు పదుల సంఖ్యలో ఉండటంతో అన్ని వైపులా విమర్శలు వచ్చాయి.అమెరికా నుంచి భారత్కు వచ్చేందుకు మొదటి విడతలో భాగంగా ఏడు విమానాలు, రెండో విడతలో మరో ఏడు విమానాలను కేటాయించింది.
దీంతో తమకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడపాలంటూ భారతీయులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన నరేంద్రమోడీ ప్రభుత్వం మరో 11 విమానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
రెండో విడతలో భాగంగా మే 28 నుంచి జూన్ 15 వరకు వీటిని భారత్- అమెరికాల మధ్య నడుపుతున్నట్లు కేంద్రం తెలిపింది.ఎమర్జెన్సీ ఉన్న వారికి, వయసు పైబడిన వారికి, గర్భవతులకు, వీసా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి , ఓసీఐ కార్డ్ హోల్డర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇప్పటికే అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
కాగా కరోనా దెబ్బకు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్ష దాటింది.ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 28 శాతానికి పైగా అక్కడే నమోదయ్యాయి.ఇప్పటి వరకు అక్కడ 17.25 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.