కొంత మందికి ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేయాలని ఉంటుంది.ప్రకృతి అందాలను చూస్తూ కాలం గడిపేయాలని అనుకుంటారు.
అలాంటి వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు.ఈ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా?.ఒక అందాల దీవిలో ఉండే ముగ్గురు పిల్లలకు చదువు చెప్పాలి అంతే.ఆ ముగ్గురు పిల్లలకు చదువు చెప్పేందుకు జీతం ఎంత ఇస్తారో తెలుసా.? ఏడాదికి రూ.57 లక్షలు ఇస్తారు.అంటే నెలకు రూ.4.75 లక్షలు.ఇంతకు ఆ దీవి ఎక్కుడుందో తెలుసుకోవాలని ఉందా.
ఈ దీవి పేరు ‘ఫెయిర్ ఐల్’.ఇది ద గ్రేట్ బ్రిటన్ లోని స్కాట్ ల్యాండ్ లోని ఓర్కనే, షెట్ ల్యాండ్ కు మధ్యలో ఉంది.నేషనల్ ట్రస్ట్ ఫర్ స్కాట్లాండ్ యాజమాన్యంలో 1954 నుంచి ఈ దీవి ఉంది.దీని విస్తీర్ణం 1,900 ఎకరాలు ఉంటుంది.
ఈ దీవిలో జనాభా కేవలం 51 మాత్రమే.ఆ దీవిలో ఓ స్కూల్ కూడా ఉంది.
అక్కడ కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు.ఈ దీవిలోని విద్యార్థులకు చదువు చెప్పేందుకు గత 35 సంవత్సరాలుగా ఒక టీచర్ పనిచేస్తున్నారు.
రూత్ స్టౌట్ అనే ఉపాధ్యాయురాలు ఈ దీవిలోని పిల్లలకు చదువులు చెబుతున్నారు.
అయితే రూత్ వచ్చే అక్టోబర్ లో రిటైర్ అవుతున్నారు.దీంతో కొత్త టీచర్ నియామకం కోసం అక్కడ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.‘ఫెయిర్ ఐల’ దీవిలోని పాఠశాలలో పనిచేసే టీచర్ కు సంవత్సరానికి 56,787 పౌండ్లు జీతం ఇస్తారట.మన కరెన్సీలో అయితే రూ.57,45,042 రూపాయలు.అంతే కాదు ఈ టీచర్ కు ఏడాదికి 2,265 పౌండ్లు జీతం పెంచుతామని స్కాట్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ స్కూల్ లో జాయిన్ అయ్యే హెడ్ టీచర్ కి ఇల్లు కూడా ఇస్తామని తెలిపింది.
ఈ పాఠశాలలో హెడ్ టీచర్ తో పాటు లెర్నింగ్ సపోర్ట్ అసిస్టెంట్లు కూడా పనిచేస్తారు.పిల్లలు చదివిన దానిని అర్థం చేసుకునేలా వీరు సహాయపడతారు.ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఈ దీవిలోనే నిర్వహిస్తారు.అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వం ఇస్తుంది.
ఇలాంటి అందాల దీవిలో ఉద్యోగం చేసే అదృష్టం ఎవరికి వస్తుందో మరి.