కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి.ఆ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నవారు, తిరిగి తనపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, వ్యక్తిగతంగానూ దూషిస్తూ ఉండడం, ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వారే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ, అనేక సంచలన ఆరోపణలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు చంద్రబాబుకి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.
గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న తప్పిదాలను ఇప్పుడు బయటకు వెళ్లిన వారు హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడంతో తెలుగుదేశం పార్టీ పరువు బజారున పడుతోందని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండానే, ఆ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి, ఆ తరువాత వైసీపీకి సన్నిహితంగా మెలుగుతూ, చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.తాజాగా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది.
అయితే అంతకుముందే తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ వంటి వారిని సస్పెండ్ చేసినా సాంకేతికంగా ఇంకా వారు టిడిపి ఎమ్మెల్యేలు గానే ఉండడంతో విప్ మీకు అందిందా లేదా అని వల్లభనేని వంశీ ని మీడియా ప్రశ్నించగా, ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.విప్ ఇవ్వడానికి చంద్రబాబు దగ్గర ఏముంది ? ఉడకబెట్టిన నాగడి దుంప అంటూ ఫైర్ అయ్యారు.
నాకు విప్ ఇచ్చేంత పెద్ద మగాడా అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఏవిధంగా విప్ జారీ చేస్తారంటూ వంశీ చంద్రబాబు ఉద్దేశించి ప్రశ్నించారు.నా కన్నా సిగ్గు ఉండాలి ? ఆయనకన్నా సిగ్గు ఉండాలి కదా అంటూ వ్యాఖ్యానించారు.తనకైతే సిగ్గు ఉంది అంటూ వంశీ చెప్పారు.
విప్ ఇవ్వడమా గాడిద గుడ్డు ఇవ్వడమా అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.బాబు చుట్టూ చెంచాలు ఉన్నారని, వారి మాటలు వింటూ పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
.