అల్లు అర్జున్ హీరోగా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తెరకెక్కించాడు.
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వక్కంతం వంశీ ఆకట్టుకోలేక పోయాడు.తనపై అల్లు అర్జున్ పెట్టిన నమ్మకంను వమ్ము చేశాడు.
రచయితలు పలువురు స్టార్ దర్శకులుగా మారారు.అదే దారిలో ఈయన కూడా స్టార్ అవుతాడని అంతా ఊహించుకున్నారు.
కాని నా పేరు సూర్య చిత్రంను ఆశించిన రేంజ్లో రూపొందించడంలో విఫలం అయ్యాడు.ఈయనతో వర్క్ చేయాలనుకున్న స్టార్స్ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.
ఇక సినిమా ఫలితం విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో చాలా లాజిక్లు మిస్ అయ్యాయి.కొన్ని కమర్షియల్ సినిమాలకు కామెడీ సినిమాలకు ప్రేక్షకులు లాజిక్స్ పట్టించుకోరు.కాని ఇదో సీరియస్, స్టార్ హీరో సినిమా.కనుక ప్రతి ఒక్క లాజిక్ సరిగా ఉండేలా దర్శకుడు కథను సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ చిన్నతనంలో ఇంట్లోంచి పారిపోతాడు.కొన్నాళ్ల తర్వాత ఒక సంతకం కోసం తండ్రి వద్దకు వస్తాడు.
తండ్రి గుర్తు పట్టినప్పటికి అల్లు అర్జున్ను తల్లి గుర్తు పట్టదు.చిన్నప్పటి నుండి కూడా కంటిపై ఒక గాటు ఉంటుంది.
ఆ గాటును చూసి అయినా తల్లి గుర్తు పట్టాలి కదా అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.
కన్న కొడుకు కళ్ల ముందు తిరుగుతున్నా కూడా కనీసం గుర్తు పట్టలేని ఆ తల్లి పాత్రలో నదియా నటించింది.
తల్లి పాత్రకు ఈ చిత్రంలో దర్శకుడు కనీస మర్యాద ఇవ్వలేదు.కొడుకు పెద్దవాడు అయ్యాకే ఇంట్లోంచి పారిపోయాడు.ఆ తర్వాత కొన్నాళ్లకు కళ్ల ముందుకు వచ్చినా కూడా గుర్తు పట్టక పోవడం ఏదో కామెడీ సినిమాలో మొహంపై మచ్చ పెట్టుకోగానే ఎవరు నువ్వు అన్నట్లుగా ఉంది.ఇంకా ఈ చిత్రంలో ఎన్నో లాజిక్లు మిస్ అయ్యాయి.
దర్శకుడు కేవలం హీరో పాత్రపై మాత్రమే శ్రద్ద పెట్టినట్లుగా అనిపిస్తుంది.
సినిమాలో లాజిక్స్ మిస్ అవ్వడంపై దర్శకుడు వంశీ వక్కంతం స్పందిస్తూ సినిమా విడుదల తర్వాత ఒక స్నేహితుడు కన్న కొడుకును ఆ తల్లి ఎలా గుర్తు పట్టకుండా ఉందని ప్రశ్నించిన సమయంలో నా మనసు చచ్చినంత పనైంది.
ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఛీఛీ అనుకుని నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించింది అంటూ వంశీ చెప్పుకొచ్చాడు.మరోసారి ఇలాంటి లాజిక్స్ మిస్ కాకుండా చూసుకుంటాను అంటూ ఆయన పేర్కొన్నాడు.
తన తప్పును నిర్మొహమాటంగా ఒప్పుకున్న వక్కంతం వంశీని అభినందించాల్సిందే.ఇకపై అయినా ఆయన నుండి మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.