కొన్ని సందర్భాల్లో మనం మంచి చేద్దామని చూసినా చెడే ఎదురవుతూ ఉంటుంది.తాజాగా ఒక ఘటనలో మంచి చేయాలని అనుకున్న ఐదుగురికి అదే విధంగా జరిగింది.
ఒక ఆవుదూడ పరోక్షంగా ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విషవాయువు పీల్చడం వల్ల ఐదుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో పురాతనమైన పాడుబడిన బావి ఉంది.
ఒక ఆవుదూడ పొరపాటున ఆ పురాతన బావిలో అదుపు తప్పి కింద పడింది.విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు ఆవుదూడను రక్షించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా దూడను రక్షించే ప్రయత్నం చేశారు.అయితే స్థానిక ప్రజలు ఆ పాడుబడిన బావిలో చాలా కాలం నుంచి చెత్త వేస్తూ ఉండేవారు.
బావిలో పడిన చెత్త విషవాయువుగా మారింది.మొదట ఒక వ్యక్తి ఆవుదూడను రక్షించాలని నిర్ణయం తీసుకుని ఒక నిచ్చెన సహాయంతో బావిలోకి దిగాడు.అయితే అక్కడి విషవాయువు వల్ల ఆ వ్యక్తికి ఊపిరి ఆడలేదు.దీంతో అకస్మాత్తుగా ఆ వ్యక్తి బావిలోనే కింద పడిపోయాడు.
అతనిని రక్షించాలనే ఉద్దేశంతో నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు.అయితే బావిలో దిగిన నలుగురు సైతం విష వాయువు గాఢత వల్ల బావిలోనే మూర్ఛపోయారు.
బావిలోకి దిగిన ఐదుగురు వ్యక్తులు మూర్చ పోవడంతో ఏం చేయాలో స్థానికులకు పాలుపోలేదు.పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి వాళ్లు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇచ్చారు.
విషయం తెలిసిన వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది, అగ్నిమాపక దళం సిబ్బంది బావిలో పడిన ఐదుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు స్పష్టం చేశారు.