ఉత్తరాఖాండ్ ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని ఉత్తరాఖాండ్ కు వస్తున్న కార్మికులను క్వారంటైన్ చేసేందుకు వినూత్నంగా ఆలోచించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయడంతో గత కొన్ని రోజుల నుంచి వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకుంటున్న విషయం తెలిసిందే.
కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తున్న వలస కార్మికులను క్వారంటైన్ చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి.
అయితే ఉత్తరాఖాండ్ ప్రభుత్వం మాత్రం పాడుబడిన దెయ్యాల గ్రామాలలో వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తోంది.ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని పౌడి జిల్లాలోని చాలా గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవు.
అందువల్ల అక్కడి కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి.
ఆ గ్రామంలో అలా చాలా కుటుంబాలు వెళ్లిపోవడంతో ఆ గ్రామాలను అక్కడి ప్రజలు దెయ్యాల గ్రామాలు అని పిలుస్తారు.ప్రస్తుతం ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ఈ దెయ్యాల గ్రామాలలో వలస కార్మికులను క్వారంటైన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.పౌడి జిల్లా అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు రాష్ట్రానికి వస్తూ ఉండటంతో నిర్జన గ్రామాల్లోని ఇళ్లను వాడుకుంటున్నామని తెలిపారు.
పౌడి జిల్లాలో 186 నిర్జన గ్రామాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.