అయోధ్యను దేశానికి, ప్రపంచానికి గర్వకారణంగా తీర్చిదిద్దాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.ఆగస్టు 5వ తేదీన ప్రతిష్టాత్మక రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్యను సందర్శించారు.
రామ జన్మభూమిలో శనివారం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం శ్రీరామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సంద్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.
, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆగస్టు 5వ తేదీన జరుగుతుందని అన్నారు.ఈ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు వస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు.ఆగస్టు 4, 5వ తేదీల్లో రాత్రి వేళల్లో అన్ని ఇళ్లు, దేవాలయాల్లో దీపోత్సవాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
అయోధ్యకు దీపావళికి చాలా అనుబంధం ఉందని చెప్పారు.
రామాలయ శంకుస్థాపన మహోత్సవం అత్యద్భుతంగా జరగాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు.రామ జన్మ భూమి కాంప్లెక్స్లో భూమి పూజ కార్యక్రమానికి 150 నుంచి 200 మంది మాత్రమే హాజరుకానున్నారు.
మూడేళ్లలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఈ మహోత్సవాన్ని ఆయోధ్య ప్రజలు తిలకించేందుకు వీలుగా సీసీటీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్టు రామ జన్మ భూమి తీర్థ క్షేత్రం వెల్లడించింది.