తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? ప్రస్తుత సారథి ఉత్తమకుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించబోతుందా? ఆయన స్థానంలో ఈ నెల 19న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారా? వీటన్నింటికి అవునే అనేదే సమాధానం.అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ ను మీడియాకు చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలో – కోమటిరెడ్డి బ్రదర్స్ సన్నిహితులో కాదు.
అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత కావడం విశేషం! అందులో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు!
అసెంబ్లీ లాబీలో మంత్రి జగదీశ్ రెడ్డి జర్నలిస్టులతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు నల్లగొండ జిల్లా రాజకీయాల అంశం చర్చకు వచ్చింది.పార్టీలో చేరికలతో పాటు 2019 ఎన్నికలపైనా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ ఎస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించారని అయితే వారికి తమ పార్టీలోకి రావడానికి దారులు మూసుకుపోయాయని చెప్పారు.ఈ నెల 19న పీసీసీ అధ్యక్షుడ్ని మార్చబోతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో తాను టచ్ లో ఉన్నానని చెప్పారు.తెలంగాణలో మరో పార్టీకి అవకాశం లేదని వచ్చే టర్మ్ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ పార్టీకి తిరుగు లేదని అన్నారు.
తెలంగాణలో వైసీపీకి అవకాశం ఉంటుంది కానీ టీడీపీ ఉండదు అని చెప్పారు.చూస్తుంటే మంత్రిగారికి టీఆర్ ఎస్ పరిణామాలపై ఉన్న పట్టుకంటే కాంగ్రెస్ – ఇతర పార్టీలపై ఆసక్తి – సమాచారం ఎక్కువే ఉన్నట్లుందని అక్కడున్న జర్నలిస్టు మిత్రులు చర్చించుకున్నారు.