2020 సంవత్సరాన్ని మన దేశంలోని ప్రజలతో పాటు ఇతర దేశాల ప్రజలు సైతం బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్నారు.కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం జనం పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు.
గతంలో కూడా అనేక వైరస్ లు వ్యాప్తి చెందినా కరోనా స్థాయిలో మాత్రం వైరస్ వ్యాప్తి ఎప్పుడూ జరగలేదు.కరోనా వైరస్ వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడటంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.
కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి కరోనా పరీక్ష తప్పనిసరి.అయితే కరోనా పరీక్షే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది.పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఒక మహిళకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.దీంతో కరోనా పరీక్ష చేయించుకోవడం ద్వారా తనకు వైరస్ సోకిందో లేదో తెలుసుకోవాలని మహిళ భావించింది.
కరోనా పరీక్ష కోసం సమీపంలోని ఒక ఆస్పత్రిని సంప్రదించింది.
వైద్య సిబ్బంది ఆమె ముక్కు నుంచి స్రావాలను(స్వాబ్) ను సేకరించారు.
అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందో లేక మరో కారణం ఉందో తెలీదు కానీ స్వాబ్ తీసుకునే సమయంలో ముక్కులో పెట్టిన పుల్ల మెదడు పొరకు తగిలింది.దీంతో మెదడులోని ద్రవం ముక్కు నుంచి బయటకు వచ్చింది.
ఫలితంగా ఆమె అనారోగ్యం బారిన పడింది.ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇలా జరగడం ప్రథమం.
ఇలా జరగడానికి గల పూర్తి కారణాలను వైద్యులు విశ్లేషించే పనిలో పడ్డారు.కొందరు శాస్త్రవేత్తలు ఆ మహిళ ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండవచ్చని లేదా వైద్య సిబ్బంది కరోనా పరీక్ష చేసే సమయంలో నిర్లక్ష్యం వహించి ఉండవచ్చని చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని కరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్య సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని వెల్లడిస్తున్నారు.