ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీకి అరుదైన గౌరవం దక్కింది.అమెరికాలోని బోస్టన్లో ఉన్న నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం విశ్వ పౌరసత్వ రాయబారిగా ఆయనను ప్రకటించింది.
ప్రపంచ శాంతి యత్నాలు, మానవతావాదం, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతవిశ్వాసాల మధ్య సామరస్యం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది.
నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్యాత్మిక సలహాదారు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ లివరింగ్ కెర్న్ దీనిపై ప్రకటన విడుదల చేశారు.
విశ్వమానవ రాయబారిగా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు, మొట్టమొదటగా రవిశంకర్ కంటే ఉత్తమమైన వ్యక్తిని తాము ఊహించలేకపోయామని పేర్కొన్నారు.ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే మానవతావాది అని కొనియాడారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు, జాతుల మధ్య పరస్పర శాంతిని పెంపొందించేందుకు, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు రవిశంకర్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని కెర్న్ ప్రశంసించారు.
కాగా, 1981వ సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు రవిశంకర్.ఇది ప్రస్తుతం విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో తన కార్యకలాపాలు సాగిస్తోంది.ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.
వ్యక్తులలో, సమాజంలో, దేశాల మధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని ఆచరింప జేయటమే లక్ష్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పనిచేస్తున్నది.
ప్రజలతో నేరుగా మమేకమవ్వడం, బహిరంగ కార్యక్రమాలు, బోధనలు, మానవసేవా కార్యకమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలకు రవిశంకర్ చేరువయ్యారు.
ఈ క్రమంలో ఆయనను అనేక అవార్డులు వరించాయి.ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారత్), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి.
ఇవికాకుండా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2000వ సంవత్సరంలో నిర్వహించిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటులలోనూ రవిశంకర్ ప్రసంగించారు.