కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు.ఆసుపత్రులకు జనం పరుగులు.
పక్కవాడు తుమ్మినా, దగ్గినా వాడిని నేరస్తుడిని చూసినట్లు చూడటం, వేరే వూరి నుంచి వస్తే సొంతవాళ్లనైనా అడుగుపెట్టనీయకపోవడం, కోట్ల ఆస్తి, బంధుగణం వున్నా దిక్కులేని వాడిలా అంత్యక్రియలు ఇలా కనీసం కలలో కూడా ఊహించని దారుణాలు ఎన్నో.వీటన్నింటికి మించి అయినవారిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మొదలైనా ఈ మహమ్మారి మనిషికి లొంగడం లేదు.తనకు తాను ఉత్పరివర్తనం చెంది మానవాళికి సవాల్ విసురుతోంది.
కోవిడ్ కారణంగా ఆత్మీయులను కోల్పోయిన బాధితుల్లో ఒకరు భారత సంతతికి చెందిన వైద్య నిపుణుడు, అమెరికా సర్జన్ జనరల్గా నామినేట్ అయిన డాక్టర్ వివేక్ మూర్తి.ఈ మహమ్మారి ఆయన కుటుంబంలోని ఏడుగురిని బలి తీసుకుంది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు.కనుక కరోనా అనేది దేశ సమస్యతో పాటు తన వ్యక్తిగత సమస్య కూడా అని గురువారం ఆయన నామినేషన్ నిర్ధారణకు భేటీ అయిన సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్, పెన్షన్స్ కమిటీ సమావేశంలో వివేక్ మూర్తి తెలియజేశారు.
అమెరికన్లను కోవిడ్ చావు దెబ్బ కొట్టిందని.దేశంలో ఐదు లక్షలకు పైగా మందిని వైరస్ బలిగొందని.
అందులో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా లక్షలాది మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని మూర్తి చెప్పారు.
తాను సర్జన్ జనరల్గా ఎన్నికైతే మాత్రం ఈ వైరస్ను అంతమొందించడమే తన తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా హళెగెరె గ్రామానికి చెందిన వివేక్ మూర్తి కుటుంబానికి తొలి నుంచి రాజకీయాలతో అనుబంధం వుంది.ఆయన తాత హెచ్టీ నారాయణ శెట్టి ఆ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.అంతేకాకుండా కర్ణాటక మాజీ సీఎం దివంగత దేవరాజ్ ఉరుసుకు అత్యంత సన్నిహితుడు.డాక్టర్ వివేక్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్ఎన్ లక్ష్మీ నరసింహ మూర్తి.మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు.ఆయన యూకేలో పలు హోదాల్లో పనిచేశారు.వివేక్ సోదరి రష్మి కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఫిజీషియన్గా సేవలు అందిస్తున్నారు.
బ్రిటన్లో జన్మించిన వివేక్ మూర్తి అమెరికాలో పెరిగారు.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
అనంతరం యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఎండీ చేశారు.ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో వివేక్ మూర్తిని ప్రజారోగ్యంపై సలహాదారుగా నియమించారు.