అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ, వ్యాక్సినేషన్, చైనా, రష్యాలతో దూకుడు వైఖరి ఇలాంటి వాటిలో కొన్ని.ఇదే సమయంలో అమెరికా సమాజంలో శతాబ్ధాలుగా వేళ్లూనుకుపోయిన వర్ణ వివక్షను తొలగించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలెట్టినట్లుగా తెలుస్తోంది.
గత కొన్నిరోజులుగా బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఈ నేపథ్యంలో బైడెన్ నోటి నుంచి సంచలన ప్రకటన వచ్చింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నల్లజాతీయురాలిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయనున్నట్టు అధ్యక్షుడు వెల్లడించారు.ప్రస్తుతం యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న స్టీఫెన్ బ్రేయర్ (83) .జూన్లో పదవీవిరమణ చేయనున్నారు.ఈ క్రమంలో స్టీఫెన్ బ్రేయర్ స్థానంలో న్యాయమూర్తిగా నల్లజాతీయురాలిని నామినేట్ చేస్తానని జో బైడెన్ వెల్లడించారు.
శుక్రవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన .సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే వారికి అసాధారణమైన విద్యార్హతలు ఉండాలి.న్యాయశాస్త్రంలో అనుభవంతోపాటు నిజాయితీ, మంచి నడవడిక ఉండాలన్నారు.తాను నామినేట్ చేయబోయే మహిళకు ఇవన్నీ వుంటాయని జో బైడెన్ పేర్కొన్నారు.అయితే అన్ని విషయాల గురించి చెప్పిన ఆయన.తాను నామినేట్ చేయబోయే మహిళ పేరును మాత్రం బయటపెట్టలేదు.
ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఆరుగురు కన్జర్వేటివ్స్, ముగ్గురు లిబరల్ జడ్జిలు వున్నారు.మరో లిబరల్ న్యాయమూర్తిని నామినేట్ చేయడం ద్వారా సమతూకం పాటించాలని జో బైడెన్ భావిస్తున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా.సుప్రీంకోర్టులో ఒక ఆఫ్రికన్- అమెరికన్ మహిళను జడ్జిగా నియమిస్తానని ఆయన వాగ్ధానం చేశారు.ఎన్నికల సమయంలో ఈ హామీ నల్లజాతీ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.అలాగే ఉపాధ్యక్షురాలిగా తొలి నల్లజాతి, తొలి దక్షిణాసియా, తొలి మహిళగా కమలా హారిస్ను బరిలోకి దింపి బైడెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
మరోవైపు కొత్త జడ్జి రేసులో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తి కేతంజి బ్రౌన్ జాక్సన్, కాలిఫోర్నియా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి లియోండ్రా క్రుగర్ వున్నారు.