అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాత్ రూడర్ గిన్స్బర్గ్ కన్నుమూశారు.ఆమె వయసు 87 సంవత్సరాలు.
గత కొన్నేళ్లుగా పాన్క్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు.మహిళల హక్కులు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం రూత్ చివరి వరకు కృషి చేశారు.
న్యూయార్క్లోని బ్రూక్లిన్లో యూదు వలసదారుల కుటుంబంలో 1933, మార్చి 15న రూత్ బాడర్ జన్మించారు.ఆమె తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు.
తల్లి సెలియా సాధారణ గృహిణి.హార్వార్డ్ యూనివర్సిటీలో లా చదువుతుండగా సహచర విద్యార్ధిన మార్టిన్ గిన్స్బర్గ్తో ఆమె ప్రేమలో పడ్డారు.1954లో ఈ జంట వివాహ బంధం ద్వారా ఒక్కటైంది.ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె.
అయితే న్యాయవాద పట్టా అందుకుని బయటకు వచ్చిన తర్వాత రూత్ బాడర్కు అంత తేలిగ్గా ఉద్యోగం లభించలేదు.పురుషాధిక్య సమాజంలో తానొక మహిళను కావడం దీనికి తోడు వలసదారునికి జన్మించడం వల్ల తనకు అవకాశాలు రావడం లేదని బాడర్ ఒకానొక దశలో తీవ్ర మనోవేదనను అనుభవించారు.
అయితే ఆ తర్వాత న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అమెరికా న్యాయవ్యవస్థపై చెరగని ముద్ర వేశారు.అడ్వొకేట్గా వున్న సమయంలో లింగ వివక్ష కేసులను ఎక్కువగా వాదిస్తూ మహిళలకు అండగా నిలిచారు.
రూత్ బాడర్ మేధస్సు, ప్రతిభను గుర్తించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్క్లింటన్ 1993లో ఆమెను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు.నాటి నుంచి 27 ఏళ్లుగా రూత్ జడ్జిగా సేవలందిస్తూ వస్తున్నారు.న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్ధతుగా నిలిచారు.గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామా హెల్త్ కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు, చివరికి ఉవ్వెత్తున ఎగిసిపడిన మీటూ ఉద్యమానికి ఆమె అండగా నిలిచారు.
రూత్ మృతిలో అమెరికాలో విషాద వాతావరణం నెలకొంది.ఆమె మరణవార్తను తెలుసుకున్న వేలాది మంది ప్రజలు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శించి రూత్కు నివాళులర్పించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ నేత జో బిడెన్ సహా పలువురు ప్రముఖులు రూత్ బాడర్కు సంతాపం తెలిపారు.