అమెరికాలో ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలన్నది లక్షలాది మంది భారతీయ యువత కల.ఇందుకు కోసం చిన్నతనం నుంచే ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ వచ్చేవారు కొకొల్లలు.
అయితే కరోనా పుణ్యమా అని అమెరికాలో ఉన్నత విద్యపై నీలినీడలు కమ్ముకున్నాయి.దీనికి తోడు విదేశీ విద్యార్ధులపై సవాలక్ష ఆంక్షలు ఉండటంతో అమెరికా ఆలోచనను ఎంతోమంది విరమించుకున్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో అగ్రరాజ్యంలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్ధులకు అమెరికా శుభవార్త చెప్పింది.
కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థి వీసా ప్రక్రియను ఆగస్టు 17 (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
దీనిలో భాగంగా స్టూడెంట్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్లు భారత్లోని యూఎస్ ఎంబసీ వెల్లడిచింది.సోమవారం నుంచి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా ప్రాసెసింగ్ నిర్వహింస్తామని తెలిపింది.
అమెరికాలో శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నందున, వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
క్లాసులు ఎప్పుడు ప్రారంభమవుతాయి.? అపాయింట్మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.ముందుగా ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్ధి, ఎక్స్ఛేంజ్ విజిటర్ అభ్యర్ధనలను పరిశీలించి వీసా అపాయింట్మెంట్లను ఇస్తామని పేర్కొంది.
తమ దేశంలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్ధులు తరగతులు ప్రారంభం కావడానికి 3 వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఇందుకు సంబంధించిన వివరాలను తమ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించింది.
కాగా సాధారణ ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.ఒకవేళ అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కోసం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
మరోవైపు వీసా అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వీసాల జారీకి అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.