గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.
కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంటోంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్లు భారత్తో సంబంధాలు మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు.
ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం భారత్-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోంది.కరోనా సంక్షోభం, అమెరికాలో అధికార మార్పు వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాల్లో ఎప్పటికప్పుడు కొత్త కోణాలను జోడిస్తున్నాయి.
ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ను అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా చూస్తొన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడును అడ్డుకోవాలంటే ఇండియా సాయం తప్పనిసరి.
అందుకే ఢిల్లీతో సంబంధాలను మరింత ధృడపరచుకోవాలని బైడెన్ భావిస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు.
ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన ఢిల్లీ చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆ హోదాలో తొలిసారిగా ఆయన భారత్కు రానున్నారు.పర్యటనలో భాగంగా 28న బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో భేటీ కానున్నారు.
ప్రధాని మోడీతో సైతం ఆయన సమావేశమయ్యే అవకాశాలు వున్నాయి.దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం వుంది.
ముఖ్యంగా కోవిడ్–19, ఇండో–పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు భారత్ తెలిపింది.ఆఫ్ఘనిస్థాన్ నుంచి తన బలగాలను అమెరికా వెనక్కి రప్పించడంతో తాలిబన్లు గడిచిన కొన్ని రోజులుగా మరింత రెచ్చిపోతున్నారు.వరుస దాడులతో దాదాపు 90 శాతం ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.దీంతో ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి తాలిబన్ల పాలన రావచ్చని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.అయితే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికే తమ మద్దతు అని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.భారత పర్యటన అనంతరం బ్లింకెన్ కువైట్ వెళ్లనున్నారు.