క్యాపిటల్ భవనంపై రిపబ్లికన్ పార్టీ మద్ధతుదారులు చేసిన దాడితో ట్రంప్ అప్రతిష్ట మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.ఆయనపై సెనేట్లో అభిశంసన తీర్మానం, కోర్టుల్లో దావాలు, తదితర అంశాలతో ట్రంప్పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డెమొక్రాట్లు భావించారు.
అయితే రిపబ్లికన్లు ఈ ప్రయత్నానికి పదే పదే అడ్డుపడుతున్నారు.తాజాగా 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర కమీషన్ ఏర్పాటును సెనేట్లో రిపబ్లికన్లు శుక్రవారం అడ్డుకున్నారు.
అమెరికా క్యాపిటల్ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ‘9/11’ తరహా స్వతంత్ర కమిషన్ను కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపిన సంగతి తెలిసిందే. జనవరి 6న జరిగిన హింసకాండకు గల కారణాలపై దర్యాప్తు చేసి నిజానిజాలపై కమిషన్ నివేదిక అందిస్తుందని చెప్పారు.
అలాగే శాంతియుత అధికార బదిలీలో జోక్యంపైనా కమిషన్ విచారణ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కమీషన్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం జరిగిన ఓటింగ్ సందర్భంగా కేవలం ఆరుగురు రిపబ్లికన్లు మాత్రమే డెమొక్రాట్ల తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.వీరిలో మిట్ రోమ్నీ, లిసా ముర్కోస్కీ, సుసాన్ కాలిన్స్ తదితరులు వున్నారు.అయితే శక్తివంతమైన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్ కొన్నెల్ మాత్రం ఈ కమీషన్ ప్యానెల్ పూర్తి పక్షపాతంగా వుంటుందని, అంతేకాకుండా న్యాయశాఖకు, ఇప్పటికే జరుగుతున్న కాంగ్రెస్ పరిశోధనలకు భిన్నంగా కొత్తగా ఏమీ సేకరించలేదని వాదించారు.నాటి ఘటన సందర్భంగా సుమారు 400 మందికి పైగా అరెస్ట్ చేయబడ్డారని, కోర్టు విచారణ సందర్భంగా ఏం జరిగిందనే దానిపై స్పష్టమైన వివరాలు తెలుస్తాయని మిగిలిన రిపబ్లికన్లు సైతం వాదించారు.
మరోవైపు ప్రతినిధుల సభలోని 211 మంది రిపబ్లికన్లలో 35 మంది డెమొక్రాట్ల తీర్మానానికి మద్ధతు పలికడం విశేషం.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.