కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడింది.ఈ ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు అమెరికన్ సెనేట్ శనివారం ఆమోదం తెలిపింది.50-49 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం.ఈ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు కలిసికట్టుగా వ్యతిరేకించారు.అయితే ఒక్క ఓటు తేడాతో బిల్లుకు ఆమోదం లభించడం విశేషం.ఈ బిల్లును వచ్చే వారం కాంగ్రెస్లో ప్రవేశపెట్టనున్నారు.అక్కడ కూడా ఆమోదం పొందితే బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయడం ద్వారా అది చట్టంగా కార్యరూపం దాలుస్తుంది.
మరోవైపు సెనేట్ ఈ బిల్లు ఆమోదించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.వైరస్ కారణంగా దేశం ఎంతో నష్టపోయిందని, ప్రజలను ఆదుకునేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.కోవిడ్ వల్ల తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా గతేడాది కాలంలోనే సుమారు 9.5 మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని.వీరిని ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఆదుకుంటామని బైడెన్ స్పష్టం చేశారు.
కాగా, ఈ ఉద్దీపన ప్యాకేజ్ ద్వారా అమెరికా పౌరులకు భారీ ఉపశమనం లభిస్తుంది.ఆర్ధిక సాయం, పన్ను మినహాయింపులు, కోవిడ్పై పోరుకు అవసరమైన నిధులును ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.అంతేకాకుండా ఒక్కో అమెరికన్ ఖాతాలోకి 1,400 డాలర్లు నేరుగా జమ అవుతాయి.దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఆర్ధికంగా పరిపుష్టం కావడానికి 350 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు.ఇక బిల్లుపై చర్చ సందర్భంగా గత వారం రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ అమెరికా అప్పుల్ని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని మూనీ తెలిపారు.దీని ప్రకారం ఆ దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు.గతేడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కో అమెరికన్కూ పంచితే 10,000 డాలర్లు వస్తుందని ఆయన చెప్పారు.2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు బరాక్ ఒబామా హయాంలో రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు.దీన్ని రోజురోజుకీ పెంచుతూ పోతున్నామని.
దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని అలెక్స్ మూనీ హెచ్చరించారు.అందువల్ల కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు తాను చెప్పిన అంశాలు పరిగణనలోనికి తీసుకోవాలని తోటి సభ్యులను కోరారు.
అంతేకాకుండా ఈ ఉద్దీపన పథకానికి కేటాయించే నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లవంటూ మూనీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.