కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.
నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.
వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయలు డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.
తాజాగా పన్నెండో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత నటరాజ కంచు విగ్రహంతోపాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం గురువారం భారత్కు తిరిగి ఇచ్చింది.వీటి విలువ 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.112 కోట్లు) ఉంటుందని అంచనా.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016 అమెరికా పర్యటన సందర్భంగా 157 భారతీయ ప్రాచీన కళాఖండాలను తిరిగి భారత దేశానికి అప్పగిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చారు.
దీనిలో భాగంగానే గురువారం మరో 91 కళాకృతులను అందజేశారు.
గత దశాబ్దకాలంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లుగా మాన్హట్టన్ జిల్లా అటార్నీ వాన్స్ తెలిపారు.
ఈ పురాతన వస్తువులను భారత్కు అందజేసేందుకు ఓ కార్యక్రమం నిర్వహించింది అమెరికా.భారత కాన్సుల్ జనరల్ రణ్ధీర్ జైశ్వాల్ ఈ కార్యక్రమానికి హాజరై.
అవసరమైన సంతకాలు చేశారు.అనంతరం కళాఖండాలను భారత్కు తిరిగి ఇచ్చినందుకు అమెరికా ప్రభుత్వానికి రణ్ధీర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, మాన్ హాటన్లో విగ్రహాలను డీలింగ్ చేసే సుభాష్ కపూర్ అనే స్మగ్లర్పై అమెరికా దర్యాప్తు సంస్థ ‘ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరిట దర్యాప్తు చేసింది.అయితే, ఆ కథనాలన్నింటినీ కపూర్ కొట్టిపారేశాడు.తమిళనాడులో చోళుల కాలం నాటి 11, 12వ శతాబ్దపు హిందూ దేవతల విగ్రహాలనే కపూర్ ఎక్కువగా అక్రమ రవాణా చేసేవాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.న్యూయార్క్ సిటీలోని సుభాశ్ కపూర్కు చెందిన ‘‘ ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీ’’లో అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ పలుమార్లు సోదాలు చేసింది.14 చోట్ల 2012 వరకు జరిగిన సోదాల్లో 2,622 కళాఖండాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ.850 కోట్ల పైమాటే.భారత దేశం, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, కంబోడియా, పాకిస్థాన్, థాయ్లాండ్ దేశాల నుంచి వీటిని దొంగిలించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.