కరోనా వైరస్ మహమ్మారికి అతలాకుతలమైన దేశం ఏదైనా వుందంటే అది అగ్రరాజ్యం అమెరికానే.కేసులు, మరణాల్లో యూఎస్తో మరే ఇతర దేశం పోటీ పడని స్థాయిలో వుంది.
అధ్యక్షుడు ట్రంప్ ఉదాసీన వైఖరితో లక్షలాది మంది అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.కరోనా వెలుగులోకి వచ్చిన నాటితో పోలిస్తే ఇప్పుడు సెకండ్ వేవ్ అమెరికన్లను తాట తీస్తోంది.
రోజుకు రెండు లక్షలకు తక్కువ కాకుండా కేసులు, మూడు వేల మరణాలు నమోదవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అమెరికా వ్యాప్తంగా ప్రారంభమైంది.
ఆ విధంగా కకావికలమైన అమెరికాకు బుధవారం మరో చేదువార్తు చెప్పింది ప్రభుత్వం.
బ్రిటన్లో వెలుగు చూసి, వణికిస్తున్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్ తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరుకుంది.
కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడికి యూకే స్ట్రెయిన్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు.అయితే ఆ వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం అధికారులను మరింత భయపెడుతోంది.
మరి ఎక్కడికి వెళ్లకుండా ఆ యువకుడికి కొత్త వైరస్ ఎలా సోకిందన్న విషయం అంతు చిక్కడం లేదు.దీంతో ఈ మిస్టరినీ ఛేదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ఆ యువకుడు ఐసోలేషన్లో ఉన్నాడు.అతని ప్రైమరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బ్రిటన్లో కొత్త వైరస్ వెలుగు చూడటంతో అమెరికా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.యూకే నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సిందేనని స్పష్టం చేసింది.
కాగా, ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా ఎప్పటిలాగే అగ్రస్థానంలో కొనసాగుతోంది.భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.రోజువారీ కొత్త కేసుల్లో అగ్రరాజ్యం తర్వాత బ్రెజిల్లో నిన్న 57,227 కేసులు రాగా… బ్రిటన్లో 53,135 పాజిటివ్ నమోదయ్యాయి.మొత్తం కోవిడ్ మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా… బ్రెజిల్, భారత్, మెక్సికో, ఇటలీ, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
రోజువారీ మరణాల్లో అమెరికా (3,088) ఫస్ట్ ప్లేస్లో ఉండగా… బ్రెజిల్ (1075), జర్మనీ (935), ఇటలీ (659), రష్యా (562) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.